అమాయక నక్సలైట్లు అడవుల్లో చనిపోతుంటే…అర్బన్ నక్సలైట్లు మాత్రం ఆస్తులు కూడగట్టుకుని ప్రభుత్వ నామినేటెడ్, కమిషన్ పదవుల్లో కొనసాగుతున్నారని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. బిజెపి కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పోలింగ్ బూత్ అధ్యక్ష, కార్యదర్శులు, ఆపైస్థాయి నాయకుల సమావేశంలో పాల్గొనేందుకు హుజురాబాద్ విచ్చేసిన బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడటమే తమ సిద్ధాంతమని పదేపదే చెప్పుకునే అర్బన్ నక్సలైట్లు…కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎందుకు వివిధ పదవుల్లో కొనసాగుతున్నారని ప్రశ్నించారు. దళిత, గిరిజన, ఆదివాసీ అమాయకులను రెచ్చగొట్టి నక్సలైట్లుగా మార్చిన అర్బన్ నక్సలైట్లే వారి చావులకు కూడా బాధ్యత వహించాల్సిందేనని ఉద్ఘాటించారు.
అధికారంలో ఉన్నా లేకున్నా మావోయిజానికి తమ పార్టీ వ్యతిరేకమని, తుపాకీ గొట్టం ద్వారా రాజ్యాధికారం అసాధ్యమని, ప్రజలు హర్షించబోరని చెబుతూ వస్తున్నామనని అన్నారు. ఈరోజు అదే నిజమైంది. కానీ మావోయిస్టుల పేరుతో అమాయకులను బలి తీసుకున్నారు. అమాయక పిల్లలను రెచ్చగొట్టి వాళ్ల ప్రాణాలను బలిగొనడానికి ప్రధాన కారణం అర్బన్ నక్సల్స్ మాత్రమేనని స్పష్టం చేశారు. ఈరోజు చనిపోయిన కుటుంబాలకు అర్బన్ నక్సల్స్ ఏం జవాబు చెబుతారు? పిల్లలు చనిపోతే తల్లిదండ్రుల గుండె ఎంతగా శోకిస్తుందో, భర్త చనిపోతే భార్య, భార్య చనిపోతే భర్త ఎంత దు:ఖానికి గురవుతారో ఈ అర్బన్ నక్సల్స్కు తెలియదా? అని అన్నారు. తాను అర్బన్ నక్సలైట్ల విషయంలో చెప్పిన మాటకు కట్టుబడి ఉంటానని అన్నా రు. మీడియా, సోషల్ మీడియా ద్వారా రెచ్చగొడుతున్న అర్బన్ నక్సల్స్ అమాయక మావోయిస్టుల చావులకు బాధ్యత వహించాలని అన్నారు. ‘ఈ అర్బన్ నక్సల్స్, పౌర హక్కుల సంఘం నాయకులను నేను ఒకటే అడుగుతున్నా…పాలకులు ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేపడితే, ప్రజలకు నష్టం జరిగితే ఉద్యమాలు చేయాలనే సిద్ధాంతం మీది కదా?
మరి అట్లాంటప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో నామినేటెడ్ పదవుల్లో, కమిషన్ పోస్టుల్లో ఎట్లా భాగస్వాములు అయ్యారు?’ అని ప్రశ్నించారు. మహిళలకు నెలకు రూ.2,500 ఇస్తామన్నారు. వృద్ధులకు రూ.4 వేల పెన్షన్ ఇస్తామన్నా రు. ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులకు అనేక హామీలిచ్చారు. ఇచ్చారా? అట్లాంటప్పుడు మీరు చేస్తున్నదేమిటి? అందుకే అర్బన్ నక్సల్స్ పైరవీలు చేస్తూ, ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆస్తులు కూడగట్టుకుంటున్నారని వ్యాఖ్యానించారు. ‘అడవుల్లో అన్నలకు విజ్ఞప్తి చేస్తున్నా….అర్బన్ నక్సల్స్ మిమ్ముల్ని రెచ్చగొడుతున్నారు. వాళ్లు ఆస్తులు కూడగడుతూ పదవులు అనుభవిస్తున్నారు. వాళ్ల మాటలు నమ్మి మోసపోవద్దని కోరుతున్నా’ అన్నారు. ‘కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఒక్క మాట ఇస్తే తప్పరు.. వచ్చే మార్చి నాటికి మావోయిజాన్ని పూర్తిగా అంతం చేస్తాం’ అని అన్నారు. ‘దయచేసి నక్సలైట్లంతా లొంగిపోవాలి. వారికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా సాయం అందిస్తున్నాం.. సంతోషంగా జీవించవచు’ అని అన్నారు. నక్సలిజాన్ని ఎవరు సమర్ధించినా వాళ్లు కూడా నేరస్తులేనని, మావోయిస్టులే తుపాకులు వదిలి జనజీవన స్రవంతిలో కలుస్తుంటే… అందుకు భిన్నంగా అర్బన్ నక్సల్స్ తుపాకులు పట్టండి, మావోయిస్టుల్లో చేరండి అంటే ఊరుకుంటామా? అది సమర్ధ నీయమా? వారి విజ్ఞతకే వదిలేస్తున్నామని అన్నారు.