భారత దేశంలో అత్యంత ప్రతిష్టాత్మక ఇండియన్ ఫోటో ఫెస్టివల్ 11వ ఎడిషన్ నవంబర్ 20 నుండి జనవరి 4 వరకు మాదాపూర్లోని స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో జరుగనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ తెలిపారు. ఫోటో జర్నలిజం నుండి లలిత కళ వరకు, డాక్యుమెంటరీ నుండి ల్యాండ్స్కేప్ వరకు కేవలం ఒక్క భారతదేశమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అద్భుత ఫోటో, డాక్యుమెంటరీ దృశ్యాలను ఈ ఇండియన్ ఫోటో ఫెస్టివల్ లో ప్రదర్శించనున్నారు. ఈ సంవత్సరం హైదరాబాద్లో నిర్వహించే ఐపిఎఫ్ ఎడిషన్లో సోలో ఎగ్జిబిషన్లు, గ్రూప్ షోకేస్లు, ఆర్టిస్ట్ టాక్స్, వర్క్షాప్లు, డాక్యుమెంటరీ ఫిల్మ్ స్క్రీనింగ్లు ఉంటాయి. ఈ ఫోటో ఫెస్టివల్ ఎడిషన్ కోసం ప్రపంచవ్యాప్తంగా 50 దేశాల నుండి 820 ఎంట్రీలు వచ్చాయి. వీటిని నిష్టాతులైన జ్యూరీ సభ్యులు నికోల్ తుంగ్ (ఫోటో జర్నలిస్ట్, 7 ఫోటో), గురిందర్ ఒసాన్ (ఫోటో ఎడిటర్, ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా), సుకృతి అనా స్టానెలీ (క్రియేటివ్ డైరెక్టర్, ది కారవాన్), మాధవన్ పిళ్లై (ఫోటోగ్రాఫర్ అండ్ క్యూరేటర్) ఫైనలిస్టులను ఎంపిక చేశారు. ఈ సందర్భంగా జరిగే ప్రధాన ఫోటో ఎగ్జిబిషన్లలో శాశ్వత ముసుగులు -అలెశాండ్రో సెలాంటే (బ్రెజిల్), రెయిన్ డాగ్స్ – రోహిత్ చావ్లా (భారతదేశం), బెటర్ డేస్ – సెంగు కిమ్ (దక్షిణ కొరియా) : స్లో ఫోటోగ్రఫీ, ముర్కీ వాటర్స్ -ది కారవాన్ ఎక్స్ ఎం. పళని కుమార్ (భారతదేశం),
సూడాన్: యుద్ధ సమయంలో – గైల్స్ క్లార్క్ (యుకె) : సూడాన్, లింగరింగ్ షాడోస్- నజానిన్ అలిపూర్ జెడ్డీ (ఇరాన్), స్లాష్ అండ్ బర్న్ – గ్లోరియానా జిమెండాజ్ (కోస్టా రికా), ఫ్రంట్లైన్స్ ఆఫ్ డిగ్నిటీ, ష్రెడెడ్ స్కైస్, ఇతర ప్రేమ కథలు మేరీలిస్ విగ్నేయు (ఫ్రాన్స్), నో మ్యాన్స్ ల్యాండ్ – ఎల్కే స్కోలియర్స్ (బెల్జియం), టాబూతో వంట – హృదయ సదానంద్ (భారతదేశం) లచే ప్రదర్శనలను ఏర్పాటు చేశారు. జెన్నిఫర్ ఆల్ఫోన్స్ దర్శకత్వం వహించిన నాగోబా జాతరతో పాటు అనేక అంశాలపై డాక్యుమెంటరీలు ప్రదర్శన ఉంటుంది. నవంబర్ 20న సాయంత్రం 5:30 గంటలకు స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ఐపిఎఫ్ 2025 – ఫెస్టివల్ ప్రారంభోత్సవ కార్యక్రమమే ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ తెలిపారు. ఈ ప్రతిష్టాత్మక ఇండియన్ ఫోటో ఫెస్టివల్లో పాల్గొనేందుకు ముందస్తు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, మరిన్ని వివరాలకు www.indianphotofest.com వెబ్ సైట్ను సందర్శించాలని జయేష్ రంజన్ ఒక ప్రకటనలో తెలిపారు.