ప్రస్తుత సాంకేతిక యుగంలో మొబైల్ ఫోన్ ద్వారానే అన్ని పనులు జరిగిపోతున్నాయి. ఏమి కావాలన్నా ఆన్లైన్లోనే ఆర్డర్లు చేయడం, వాటి చెల్లింపులన్నీ మొబైల్ ద్వారానే జరుగుతున్నాయి. ఏది నిజమో ఏది అబద్దమో తెలుసుకోలేని స్థితి నెలకొంది. హైదరాబాద్ లాంటి మహానగరంలో ట్రాఫిక్ సమస్య, బిజి లైఫ్తో పూర్తిగా ఆన్లైన్ మీదనే ఆధారపడుతున్నారు. ఇదే అదనుగా సైబర్ నేరగాళ్లు సిద్దంగా ఉంటున్నారు. సైబర్ కేటుగాళ్లు అమాయకులకు వల వేసి వారి ఖాతాల్లోని నగదును సునాయాసంగా కాజేస్తున్నారు. తాజాగా సైబర్ నేరగాళ్లు ఏకంగా ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్నే బురిడీ కొట్టించారు. Jubliehillswinespot.in వెబ్సైట్ నుంచి ఇన్కమ్ టాక్స్ కమిషనర్ వైన్ ఆర్డర్ చేశారు.
గూగుల్ పే ద్వారా మొదట రూ. 2,320 చెల్లింపు చేశారు. అనంతరం హోమ్ డెలివరీ సౌకర్యం అందుబాటులో ఉందని, డెలివరీ డబ్బులు చెల్లిస్తే ఇంటికే డెలివరీ చేస్తామని వెబ్సైట్ నుండి మరో స్కానర్ పంపారు. దీంతో ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ ఆ స్కానర్ను స్కాన్ చేయగా, వెంటనే అతడి ఖాతా నుంచి రూ.40 వేలు కట్ అయ్యాయి. ఈ సంఘటనకు ఆ ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ షాకయ్యారు. తేరుకుని వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.