ఆన్లైన్ బెట్టింగ్, గేమింగ్ యాప్ల ప్రమోషన్ కేసులో సిఐడి సిట్ దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఈ కేసుకు సంబంధించి ప్రముఖ నటుడు రానా దగ్గుబాటి, యాంకర్ విష్ణుప్రియలు శనివారం సిఐడి సిట్ విచారణకు హాజరయ్యారు. సుమారు గంటన్నర పాటు అధికారులు వారిని విచారించి స్టేట్మెంట్లను రికార్డు చేశారు. విష్ణుప్రియ బ్యాంక్ అకౌంట్ వివరాలతోపాటు బ్యాంక్ స్టేట్మెంట్ వివరాలను సిట్ అధికారులకు అందజేశారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసేందుకు కుదుర్చుకున్న ఒప్పందంపై అధికారులు ఆమెను ప్రశ్నించారు. ప్రమోషన్ ద్వారా వచ్చిన పారితోషికాలపైనా అధికారులు విచారణ చేశారు. కాగా, తాజ్ 777 బుక్ డాట్ కామ్(Taj777 Book.com) సహా మరో రెండు బెట్టింగ్ యాప్స్ను విష్ణు ప్రియ ప్రమోట్ చేశారు. సినీ నటుడు దగ్గుబాటి రానా సైతం సిఐడి సిట్ విచారణకు హాజరయ్యారు. రానా తన బ్యాంక్ ఖాతా వివరాలు, స్టెట్మెంట్లతో విచారణకు వచ్చారు.
బెట్టింగ్ యాప్తో చేసుకున్న అగ్రిమెంట్, ఆ యాప్ యాజమాన్యం ద్వారా వచ్చిన పారితోషికంపై రానాను అధికారులు ప్రశ్నించారు. కాగా, రానా 2017లో బెట్టింగ్ అండ్ గేమింగ్ యాప్ను ప్రమోట్ చేశారు. స్కిల్ బేస్డ్ గేమ్ యాప్ను మాత్రమే తాను ప్రమోట్ చేశానని సిఐడికి రానా వాంగ్మూలం ఇచ్చినట్లు తెలుస్తోంది. విచారణ అనంతరం రానా మీడియాతో మాట్లాడుతూ ఒప్పందం చేసుకునే సమయంలో తన నాయ్యబృందం అన్ని పరిశీలించాకే ఒప్పందం చేసుకున్నట్లు తెలిపారు. చట్టబద్ధమైన యాప్ అని తెలుసుకున్న తర్వాతే ప్రమోట్ చేసినట్లు చెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా పని చేస్తున్న ఏ సంస్థతోనూ తాను ఒప్పందం చేసుకోలేదని రానా స్పష్టం చేశారు. తన న్యాయబృందం పూర్తిగా పరిశీలించిందని రానా వెల్లడించారు. దీనికి సంబంధించిన వివరాలన్నీ సిట్ అధికారులకు ఇచ్చానని, విచారణకు పూర్తిగా సహకరించినట్లు రానా పేర్కొన్నారు.