ప్రపంచ వ్యాప్తంగా సిల్వర్ స్క్రీన్పై సంచలనం సృష్టించి, 2024 ఆస్కార్ అవార్డులకు నామినేట్ అయిన ‘ది ఫేస్ ఆఫ్ ది ఫేస్లెస్’ మూవీ తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ట్రై లైట్ క్రియేషన్స్ నిర్మించిన ఈ మూవీ దివ్యవాణి సోషల్ కమ్యూనికేషన్స్ మద్దతుతో నవంబర్ 21న తెలుగులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఒకప్పటి హీరో రాజా మాట్లాడుతూ “క్షమాపణ అనేది అందరి వల్ల అయ్యేది కాదు. క్షమాపణ అనేది గొప్పది. రాణి మారియా త్యాగం గురించి సినిమా ఉంటుంది. 123 అవార్డులు పొందిన ఈ సినిమా ఆస్కార్ అవార్డులకు కూడా నామినేట్ అయింది”అని అన్నారు. దివ్యవాణి సోషల్ కమ్యూనికేషన్స్ సీఈఓ డాక్టర్ ఐ. లూర్దూ రాజ్ మాట్లాడుతూ.. “ఒకరిని క్షమిస్తేనే శాంతి ఉంటుంది. ప్రపంచాన్ని కదిలించిన ఈ సినిమా ప్రతి ఒక్కరికి నచ్చుతుంది”అని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ క్రిస్టియన్ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ దీపక్ జాన్, సిఎస్ఐ బిషప్ విల్సన్, డైరెక్టర్ వంశీకృష్ణ, జక్కుల కృష్ణ మోహన్ పాల్గొన్నారు.