జాతీయ రాజకీయాలపై ప్రభావం చూపనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికలపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. కేంద్రంలో బిజెపికి పూర్తి మెజార్టీ లేకపోవడం తో నరేంద్ర మోడీ ప్రభుత్వం టిడిపి, జెడి(యు) పార్టీలపై ఆధారపడిన నేపథ్యంలో బీహార్ శాసనసభ ఎన్నికలు దేశరాజకీయలపై ప్రభావం చూపనున్నాయి. బీహార్లో బిజెపి, జెడి(యు) పార్టీల మధ్య మైత్రి కొనసాగింపుకు ఈ ఎన్నికలు కొలమానంగా నిలువనున్నాయి. రాష్ట్రంలో దశాబ్దాలుగా ఏ ఒక్క పార్టీకి ఏకఛత్రాధిపత్యంగా అధికారం ఇవ్వకుండా సంకీర్ణ ప్రభుత్వాలకు పట్టం గడుతున్న బీహార్ ప్రజలు మరోసారి ఎన్డిఎకే జైకొట్టనున్నారని పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ ఎగ్గిట్ పోల్ సర్వేల్లో వెల్లడైంది. రాష్ట్రంలో మరోసారి అధికారం రావడానికి ఎన్డిఎకి నిమో (నితీశ్+మోడీ) ఫార్ములా దోహదపడింది. నితీశ్ ప్రభుత్వం ఎన్నికల ముందు రాష్ట్రంలో మహిళా రోజ్గార్ యోజన పథకం కింద దాదాపు కోటి 25 లక్షల మంది మహిళలకు రూ.10 వేల నగదు పంపిణీ చేయడం ఎన్డిఎ విజయానికి కీలకంగా మారింది.
బీహార్ 2025 అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి, జెడి(యు) నేతృత్వంలోని ఎన్డిఎ, కాంగ్రెస్, ఆర్జెడి నేతృత్వంలోని మహాఘట్బంధన్పై భారీ ఆధిక్యంతో అధికారం చేపడుతుందని పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ సర్వేలో వెల్లడైంది. ఎన్డిఎ దాదాపు 8.3 శాతం ఓట్ల ఆధిక్యంతో మహాఘట్బంధన్ కూటమి మీద పైచేయి సాధిస్తోంది. ఎన్డిఎకి 46.2 శాతం ఓట్లు, మహాఘట్బంధన్కు 37.9%, కొత్తగా స్థాపించిన జన్ సురాజ్ పార్టీకి 9.7 శాతం, ఇతరులకు 6.2 శాతం ఓట్లు వచ్చే అవకాశాలున్నాయి. ఈ సర్వే ఫలితాల్లో మూడు శాతం ‘ప్లస్ ఆర్ మైనస్’ ఉండే అవకాశాలున్నాయి. 243 స్థానాలు ఉన్న బీహార్ లో అధికారం చేపట్టడానికి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 122 కాగా, ఎన్డిఎకు 133- 159 స్థానాలు వచ్చే అవకాశాలుండగా, మహాఘట్ బంధన్ 75 -101 స్థానాలకు పరిమితమయ్యే అవకాశాలున్నాయి. ఇతరులకు 2 8 స్థానాలు, జన్సురాజ్ పార్టీకి 0 -5 స్థానాలు వచ్చే అవకాశాలున్నాయి. పార్టీల వారీగా సాధించే స్థానాలను పరిశీలిస్తే ఎన్డిఎ కూటమిలో బిజెపి 63- 70, జెడి(యు) 55- 62, ఎల్జెపి (ఆర్వి) 12-17, హెచ్ఎఎమ్ 2-5, ఆర్ఎల్ఎం 1-4 స్థానాలు గెలిచే అవకాశాలున్నాయి. మహాఘట్ బంధన్లో ఆర్జెడి 62-69, కాంగ్రెస్ 9- 18, సిపిఐ (ఎంఎల్) 4-9 గెలిచే అవకాశాలున్నాయి. కొత్తగా స్థాపించిన జన్ సురాజ్ పార్టీ 0-5 స్థానాలు, ఎఐఎంఐఎం పార్టీ 0-2, సిపిఐఎంకి 0-3, విఐపికి 0- 5, సిపిఐ 0- 2, ఇతరులు 2- 8 స్థానాలు గెలిచే అవకాశాలున్నాయి. ఒక్కొక్క పార్టీ పొందే ఓట్ల శాతాన్ని పరిశీలిస్తే బిజెపికి 21.4 శాతం, ఆర్జెడికి 23.3 శాతం, జెడి(యు)కి 17.6 శాతం, జన్ సురాజ్ పార్టీకి 9.7 శాతం, కాంగ్రెస్ పార్టీకి 8.7 శాతం, ఎల్జెపికి 5%, ఇతరులకు 7.2%ఓట్లు వచ్చే అవకాశాలున్నాయి.
2020 అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి 19.46% ఓట్లతో 74 స్థానాలు, జెడి(యు) 15.39 శాతం ఓట్లతో 43 స్థానాలు, ఆర్జెడి 23.11% ఓట్లతో 75 స్థానాలు, కాంగ్రెస్ 9.48% ఓట్లతో 19 స్థానాల్లో గెలిచాయి.గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డిఎ మహాఘట్ బంధన్ కూటమిపై కేవలం 0.03 ఓట్ల వ్యత్యాసంతో సుమారు 11 వేల ఓట్ల ఆధిక్యంతోనే అధికారం చేపట్టగా, ప్రస్తుత ఎన్నికల్లో ఎన్డిఎ భారీ ఆధిక్యత పొందడానికి ప్రధాన కారణం జెడి(యు) మంచి ఫలితాలు సాధించడమే. ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుందని ఓటర్లను ప్రశ్నించినప్పుడు ఆర్జెడి యువ నేత తేజస్వి యాదవ్ 32 శాతంతో అగ్రస్థానంలో ఉన్నారు. 2005 నుండి కొన్ని నెలలు మినహా 20 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న నితీశ్ కుమార్ 30 శాతం ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి అరంగేట్రం చేసిన రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ 8%, ఎల్జెపి నేత, కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ 8 శాతంతో మూడో స్థానంలో ఉన్నారు. బిజెపి నేత సామ్రాట్ చౌదరికి 6%, కాంగ్రెస్ నేత రాజేశ్ కుమార్కి 2% మంది మద్దతిచ్చారు. సామాజిక వర్గాలవారీగా పరిశీలిస్తే అగ్రవర్ణాలు, ఎస్సిలు, ఎస్టిలు, ఇబిసి వర్గాలు ఎన్డిఎకు మద్దతుగా నిలుస్తున్నారు. ముస్లిం, బుద్ధిస్టులు, ఒబిసి సామాజిక వర్గాల్లో అధిక శాతం మహాఘట్బంధన్ వైపు ఉన్నారని పీపుల్స్ పల్స్ సర్వేలో వెల్లడైంది. బీహార్లో ఎన్డిఎకు పట్టంకట్టడంలో మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారు.
రాష్ట్రంలో 66.8% మహిళలు ఎన్డిఎ వైపుఉండగా, మహాఘట్బంధన్కు 24.8% ఓటర్లు మాత్రమే మద్దతిస్తున్నారు. బ్రాహ్మణ, కుశ్వ, పాశ్వాన్, రాజ్పుత్, కుర్మి, చమార్, భూమియార్, మల్లా, తేలి, బనియా, కాను, నోనియా సామాజిక వర్గాల్లో ఎన్డిఎకు బాసటగా నిలుస్తున్నాయి. మహాఘట్ బంధన్ కేవలం యాదవ్, ముస్లిం, ఒబిసిల్లోని కొన్ని వర్గాల్లో మాత్రమే కొంత ఆధిక్యత కనబరుస్తోంది. జాతీయ స్థాయిలో నరేంద్ర మోడీకి ఉన్న జనాకర్షణ, రాష్ట్రంలో నితీశ్ కుమార్పై ఉన్న ప్రజాదరణ బీహార్ లో ఎన్డిఎ గెలుపుకు అనుకూలంగా మారాయి. బీహారీలను ఆకర్షించడంలో నితీశ్ కుమార్ వంటి జనాకర్షణ కలిగిన నాయకుడు తమ పార్టీలో లేకపోవడంతో బిజెపి ఆయనపైనే ఆధారపడాల్సి వచ్చింది. అందుకే మోడీ ప్రచారంలో నితీశ్ను పొగడ్తలతో ముంచెత్తారు. 75 ఏళ్ల వయసులోనూ నితీశ్ ఎన్డిఎకు ట్రంప్ కార్డుగా ఉన్నారు. ఆయనకున్న క్లీన్ చీట్ ఇమేజీ ఎన్డిఎకు బలంగా మారింది. రెండు దశాబ్దాలుగా సిఎంగా ఉన్నా నితీశ్ ప్రత్యక్ష ఎన్నికల్లో ఎప్పుడూ పోటీ చేయలేదు. ఎంఎల్సిగా ఎన్నికవుతూ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహిస్తున్నారు. సిట్టింగ్ ఎంఎల్ఎలు అభివృద్ధిని పట్టించుకోలేదని, అవినీతికి పాల్పడ్డారనే వ్యతిరేకత ప్రజల్లో కనిపించినా ‘నిమో’ ఫార్ములా ఎన్డిఎకు అనుకూలించింది. 20 సంవత్సరాలు అధికారంలో ఉన్నా నితీశ్ ప్రభుత్వ వ్యతిరేకతను తట్టుకొని నిలబడడానికి ప్రధాన కారణం మహిళల ఆశీర్వాదమే. ఎన్డిఎతో పోలిస్తే మహాఘట్బంధన్ బలహీనంగా ఉంది. ఆ కూటమి సిఎం అభ్యర్థి తేజస్వీ యాదవ్లో 2020 ఎన్నికల్లో ఉన్న ఉత్సాహం 2025 ఎన్నికల్లో కనిపించలేదు.
ప్రస్తుత ఎన్నికల్లో తేజస్వీయాదవ్ నిరుద్యోగం, వలసలు అంశాలను ప్రచార అస్త్రాలుగా చేసుకున్నా 2020లో ఆయనకు యువతలో ఉన్న క్రేజీ ఇప్పుడు తగ్గింది. నిరుద్యోగం, వలసలపై యువతలో అసంతృప్తి ఉన్నా అది పూర్తిగా తేజస్వి యాదవ్కు అనుకూలంగా మారలేదు. జన్సురాజ్ పార్టీ, బిజెపి కూడా యువత ఓట్లను ఆకర్షించాయి. మహాఘట్బంధన్ కూటమి ముస్లిం, యాదవ్ సామాజికవర్గాల్లో ఇప్పటికే 33% మద్దతున్నా, దాన్ని 40 శాతానికిపైగా దాటించడమే తేజస్వి యాదవ్కు ప్రధాన సమస్యగా మారింది. మరోవైపు తేజస్వి యాదవ్కు తన తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్పై ఉన్న ‘జంగల్ రాజ్’ అభియోగం పెద్ద గుదిబండగా మారింది. లాలూప్రసాద్ పాలనలో యాదవ్ సామాజిక వర్గాల ఆధిపత్యాన్ని ఇప్పటికీ దళితులు, అగ్రవర్ణాలు మరవకపోవడం తేజస్వి యాదవ్కు ప్రతికూలమైంది.మహాఘట్బంధన్లో ప్రధాన భూమిక పాత్ర పోషిస్తున్న కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీవలే ప్రజలను ఆకర్షించడంలో విఫలమయ్యారు. ఆయన ఎత్తుకున్న ‘ఓట్ చోరీ’ నినాదం బీహార్లో ఓట్లను రాల్చలేకపోయింది. రెండు కూటములు సంక్షేమ పథకాలపై పోటాపోటీగా హామీలిచ్చాయి.
మహాఘట్బంధన్ నిరుద్యోగం, వలసలను ప్రచారాస్త్రాలుగా చేసుకుంటే, ఎన్డిఎ ‘జంగల్ రాజ్’ తో పాటు అభివృద్ధిపై ప్రచారం చేసింది. ప్రధాని మోడీ లాలూప్రసాద్ యాదవ్ ను లక్ష్యంగా చేసుకొని విమర్శలుచేస్తూ ‘జంగల్ రాజ్’ను ప్రచారాస్త్రంగా మార్చుకున్నారు. రాష్ట్రంలో ఎన్డిఎ చెబుతున్నట్టు అభివృద్ధి జరిగితే బీహారీలు ఎందుకు వలసెళ్తున్నారని మహాఘట్ బంధన్ ప్రచారం చేసింది. ఇతర పార్టీలతో పోలిస్తే బిజెపికి వనరులు అధికంగా ఉండడం ఎన్డిఎకు అనుకూలంగా మారింది. డిజిటల్ ప్రచారంలో అన్ని పార్టీలు చేసిన ఖర్చులను కలిపినా ఒక్క బిజెపి చేసిన ఖర్చు కంటే తక్కువే. 2020 ఎన్నికలకు ప్రస్తుత 2025 ఎన్నికలకు మధ్య భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. దళితులలో ఆదరణ ఉన్న ఎల్జెపి 2020లో విడిగా పోటీ చేయగా ప్రస్తుతం ఎన్డిఎలో ఉండడంతో ఎన్డిఎ మరింత బలపడింది.
యావత్ దేశాన్ని ఆకర్షించిన బీహార్ శాసనసభ ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ యువతను ఆకర్షించడంలో విజయవంతం అయ్యారు. ప్రస్తుత ఎన్నికల్లో ఆయనకు చెప్పుకోదగ్గ సీట్లు రాకపోయినా భవిష్యత్లో బీహార్ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించే పార్టీగా జన్సురాజ్ ఎదగడం ఖాయమని పీపుల్స్పల్స్ అధ్యయనంలో స్పష్టమైంది. ఎన్డిఎలో బిజెపి, జెడి (యు) భారీగా సీట్లు పొందే అవకాశాలు కనిపిస్తుండగా, ఆర్జెడి చెప్పుకోదగ్గ స్థానాలు సాధిస్తున్నా, కాంగ్రెస్కు ఆశించిన మేరకు సీట్లు వచ్చే అవకాశాలు లేకపోవడంతో మహాఘట్బంధన్కు నష్టం జరుగుతోంది. ప్రధానంగా మహిళా ఓటర్లు ఆదరిస్తుండడంతో బీహార్లో మరోసారి ఎన్డిఎ జయకేతనం ఖాయంగా కనిపిస్తోంది.
జి. మురళీ కృష్ణ