న్యుమోనియా అంటువ్యాధితో 2021లో 2.2 మిలియన్లు మరణించగా, అందులో 5.02 లక్షల మంది పిల్లలు ఉన్నారు. ఐదేళ్ల లోపు వయసున్న పిల్లల అధిక మరణాలకు కారణమైన వ్యాధి న్యుమోనియా. కొవిడ్- 19 కారణంతో మరో 10 మిలియన్లు కూడా అదనంగా మరణించినట్లు గణాంకాలు తెలియజేస్తున్నాయి. అధిక ప్రాణాలను గైకొంటున్న వ్యాధుల్లో న్యుమోనియా ప్రధానమైనదని తేలింది. వాతావరణ ప్రతికూల మార్పులు, గాలి కాలుష్యం కోరలు చాచడంతో శ్వాసవ్యవస్థ, ఊపిరితిత్తుల సమస్యలు ఉత్పన్నం కావడం, న్యుమోనియా మహావిపత్తు వస్తుందనే భయం కూడా ఉందని, పది లక్షలమందికి న్యుమోనియా సోకే ప్రమాదంలో ఉన్నారని వైద్యులు అంచనా వేస్తున్నారు. న్యుమోనియా వ్యాధి ఐదేండ్ల లోపు పిల్లలకు, వృద్ధులకు వస్తుంది. టీకాలు వేయించుకోనివారు, పోషకాహార లోపాలు, ఇంట్లో వంట చెరుకువాడేవారు, కలుషిత గాలి పీల్చే పెద్దలు, పొరతాగే దురలవాటు ఉన్నవారు అధికంగా న్యుమోనియా బారినపడే ప్రమాదం ఉంటుంది. న్యుమోనియా వ్యాధి తీవ్రత, ప్రమాదాన్ని గుర్తించిన అంతర్జాతీయ సమాజం 2009 నుంచి ఏటా 12 నవంబర్ రోజున ప్రపంచ న్యుమోనియా దినం పాటిస్తూ ఆ వ్యాప్తిపట్ల కనీస అవగాహన కల్పించడం జరుగుతోంది.
బ్యాక్టీరియా, వైరస్ లేదా ఫంగీ సంక్రమణ కారణంగా తాపజనక శ్వాస రుగ్మత (ఇన్ఫ్లమేటరీ రెస్పిరేటరీ డిసార్డర్) లేదా న్యుమోనియా వ్యాధి అంటుకుంటుంది. ఈ సూక్ష్మజీవులు ఊపిరితిత్తుల్లో చేరి ఎల్వియోలి అనే భాగంపై ప్రభావాన్ని చూపి న్యుమోనియాకు దారి తీస్తుంది. దీని వల్ల ఊపిరితిత్తుల్లో నీరు చేరి శ్వాస తీసుకోవడం ఇబ్బంది అవుతుంది. బలహీన వ్యాధి నిరోధకశక్తి కలిగిన పిల్లలు, వృద్ధులకు న్యుమోనియా సోకి ప్రాణాంతకంగా కూడా మారవచ్చు. ప్రపంచ న్యుమోనియా దినం -2025 ఇతివృత్తంగా పిల్లల మనుగడ (చైల్ సర్వైవల్) అనబడే అంశాన్ని తీసుకొని ప్రచారం నిర్వహిస్తున్నారు. న్యుమోనియా నివారించదగిన అంటువ్యాధి. వ్యాధిగ్రస్థులు తుమ్మడం, దగ్గడం, ముక్కు చీదడం లాంటి సందర్భాల్లో మరొకరికి సంక్రమిస్తుందని తెలుసుకోవాలి. పిల్లల్లో బ్యాక్టీరియా కారణ స్ట్రెప్టోకోకల్ న్యుమోనియా అతి ప్రధానమైనది. దాని తర్వాత హిమోఫిలస్ ఇన్ఫ్లుయెంజా రెండవ ప్రధానమైనది. న్యుమోనియాలో రెస్పిరేటరీ సిన్సిటియల్ వైరస్ వ్యాధి వైరస్ వర్గంలో ముఖ్యమైనది. న్యుమోనియా వ్యాధికి చికిత్స కూడా అందుబాటులో ఉన్నది. ప్రపంచ న్యుమోనియా దినం వేదికగా ప్రభుత్వాలు, వైద్యఆరోగ్యశాఖ, ఎన్జిఒలు, ఇతర సంస్థలు కలిసి న్యుమోనియా పట్ల అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం, సోకకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు, రోగగ్రస్థులకు చికిత్సా పద్ధతులు వివరించడం మంచి ఫలితాలను ఇస్తాయి. న్యుమోనియాను తొలిదశలో గుర్తించడం, చికిత్స తీసుకోవడం, నివారణ మార్గాలను తెలుసుకోవడం లాంటి అంశాలను గుర్తుంచుకోవాలి.
ప్రపంచ ఆరోగ్య సంస్థ వివరాల ప్రకారం ఏట 14 లక్షల పిల్లలు న్యుమోనియా సోకి చనిపోవడం, పిల్లల మరణాల్లో 18% వరకు న్యుమోనియా కారణం కావడం గమనార్హం. యూనిసెఫ్ వివరాల ప్రకారం ప్రతి 39 సెకన్లకు ఒక పిల్లవాడు న్యుమోనియాతో మరణిస్తున్నాడు. వృద్ధుల్లో న్యుమోకోకల్ న్యుమోనియా అధికంగా సోకుతుంది. న్యుమోసిస్టిక్ జిరోవెస్సీ వ్యాధి ఫంగస్ సోకడంతో వస్తుంది. గాలి కాలుష్యం, స్మోకింగ్ వల్ల 16 లక్షల వృద్ధులు మరణిస్తున్నారు. డబ్ల్యుహెచ్ఒ, యూనిసెఫ్లు సంయుక్తంగా న్యుమోనియా, డయేరియా వ్యాధుల కట్టడికి గ్లోబల్ ఆక్షన్ ప్లాన్ అమలు చేస్తున్నారు. ఐదేళ్లలోపు పిల్లలు, 65 ఏండ్లు దాటిన వృద్ధులు, దీర్ఘకాలిక అనారోగ్యాలతో బాధపడుతున్న రోగులు, పర్యావరణ కాలుష్య ప్రాంతాల్లో నివసిస్తున్న జనులు, హెచ్ఐవి/కేన్సర్ లాంటివి సోకిన వ్యాధిగ్రస్థులు న్యుమోనియా ప్రమాదంలో పడే అవకాశాలే ఎక్కువ.
టీకాలు వేయించడం, పోషకాహారం అందిచడం, గాలి కాలుష్యాన్ని తగ్గించడం వల్ల న్యుమోనియా వ్యాధి తీవ్రత తగ్గుతుంది. ఆంటీబ్యాక్టీరియల్, అంటీ వైరల్, ఆంటీ ఫంగల్ ఔషధాలతో న్యుమోనియా కట్టడి జరుగుతుంది. భౌతిక దూరాలు పాటించడం, మాస్కులు ధరించడం, బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయకుండా ఉండడం, దగ్గినపుడు లేదా తుమ్మినపుడు కండువా కప్పుకోవడం వంటి పలు జాగ్రత్తలు న్యుమోనియా కేసులను తగ్గిస్తాయి. పిల్లలకు, పెద్దలకు అతి ప్రమాదకరమైన అంటువ్యాధిగా నిలిచిన న్యుమోనియా పట్ల సరైన అవగాహన పెంచుకొని అలాంటి ప్రాణాంతక రుగ్మతకు చరమగీతం పాడదాం, న్యుమోనియా కానరాని భారతాన్ని నిర్మించుకుందాం.
డాక్టర్ బుర్ర మధుసూదన్ రెడ్డి
9949700037