పత్తి రైతుల ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని నవంబర్ 14న చలో వరంగల్ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలంగాణ పత్తి రైతుల సంఘం వెల్లడించింది. వరంగల్లోని సిసిఐ రీజనల్ కార్యాలయం ఎదుట జరిగే మహా ధర్నాను జయప్రదం చేయాలని సంఘం రాష్ట్ర కన్వీనర్ భూక్యా చందు నాయక్, కో కన్వీనర్ మూడ్ శోభన్ పిలుపునిచ్చా రు. ఇందుకు సంబంధించి బుధవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద తెలంగాణ పత్తి రైతుల సంఘం ఆధ్వర్యంలో పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా భూక్యా చందు నాయక్, మూడ్ శోభన్ లు మాట్లాడుతూ తేమతో నిమిత్తం లేకుండా సిసిఐ ద్వారా రైతుల పత్తి పంటను కొనుగోలు చేయాలని, రైతులు పండించిన పత్తి పంటను ఎక్కడైనా స్వేచ్ఛగా విక్రయించే అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం విదేశాల నుండి దిగుమతి చేసుకునే పత్తిపై 11 శాతం సుంకాన్ని ఎత్తివేయడాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కపాస్ కిసాన్ యాప్ వల్ల కౌలు రైతులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. కావున యాప్ అమలు వెనక్కి తీసుకోవాలన్నారు.
సిసిఐ ఆధ్వర్యంలో గతంలో మాదిరిగా ప్రతి ఎకరాకు 12 క్వింటాల్ పత్తిని కొనుగోలు చేయాలని, పతి ఎకరాకు కేవలం 7 క్వింటాల్ కొనుగోలు చేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి క్వింటాల్ కు 475 బోనస్ అమలు చేయాలని, మ్యాపింగ్ పేరుతో కాటన్ మిల్లుల దగ్గరలో ఉన్న గ్రామాల రైతులను సుదూర ప్రాంతాలకు పంపడం వలన రవాణా ఛార్జీలు పెరిగి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, కావున అట్టి మ్యాపింగ్ పద్ధతిని సిసిఐ విరమించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ పత్తి రైతుల సంఘం రాష్ట్ర కో కన్వీనర్ వాసిరెడ్డి వరప్రసాద్, రాష్ట్ర నాయకులు అన్నవరపు సత్యనారాయణ, యలమంచిలి వంశీ కృష్ణ, బొంతు రాంబాబు, మాదినేని రమేష్, కందాల శంకర్ రెడ్డి, వీరేపల్లి వెంకటేశ్వర్లు, శెట్టి వెంకన్న, రాజన్న, ఆముదాల మల్లారెడ్డి, వెంకట్ మావో, చల్లారపు తిరుపతి రెడ్డి, మిల్కురి వాసుదేవ రెడ్డి, బండి రమేష్ తదితరులు పాల్గొన్నారు.