ముంబై : బాలీవుడ్ సీనియర్ నటుడు ధర్మేంద్ర, గోవింద బుధవారంనాడు ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. ఇక్కడి బ్రీచ్కాండీ ఆస్పత్రిలో కొద్ది రోజులుగా చికిత్స తీసుకుంటున్న 89 ఏళ్ల ధర్మేంద్ర ఉదయాన్నే ఇంటికి వెళ్లారు. కుటుంబ సభ్యులు ఆయనకు ఇంటి వద్ద చికిత్స జరిపించాలని నిర్ణయించుకున్నారని, తదనుగుణంగా ఆయనకు ఇంట్లోనే చికిత్స అందజేయనున్నట్లు ఆస్పత్రి వర్గాలు ప్రకటించాయి. ధర్మేంద్ర ఆరోగ్యంపై పుకార్లు వెల్లువెత్తడంతో కుటుంబ సభ్యులు స్పందించారు. ఆయన కోలుకుంటున్నారని, ఫేక్ వార్తలు ప్రసారం చేయవద్దని, ఆయన కోసం ప్రార్ధించిన అందరికీ కృతజ్ఞతలు అని ధర్మేంద్ర కుమారుడు సన్నీ డియోల్ ప్రతినిధి ఒక ప్రకటలో తెలిపారు.
మరోవైపు స్వల్ప అనారోగ్యానికి గురైన మరో నటుడు గోవిందా(61) మంగళవారంనాడు రాత్రి కొంత స్పృహ కోల్పోవడంతో క్రిటీ కేర్ ఆస్పత్రికి వచ్చారు. అక్కడ వైద్యుల పరీక్షల అనంతరం బయటికి వచ్చి మీడియాతో మాట్లాడారు. ఇప్పుడు బాగానే ఉన్నానని, వైద్యులు అతిగా వర్కౌట్ చేయవద్దని సలహా ఇచ్చారని, యోగా, ప్రాణాయామంతో సరిపెట్టుకోవాలని సూచించినట్లు తెలిపారు. చికిత్స కొనసాగుతుందని, డాక్టర్లు కొన్ని మందులు ఇచ్చి వాడాలని సూచించారని గోవిందా వివరించారు.