రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ ద్వారా అభివృద్ధి చేసిన లే ఔట్లలో నివాస భవనాల నిర్మాణానికి అనువైన ప్లాట్లను బహిరంగ వేలం ద్వారా విక్రయించనున్నారు. నగరానికి సమీపంలో ఉన్న తొర్రూర్, బహూదూర్ పల్లి, కుర్మల్గూడ ప్రాంతాల్లోని 163 ఓపెన్ ప్లాట్లను ఈనెల 17, 18 తేదీల్లో బహిరంగ వేలం ద్వారా విక్రయిస్తున్నట్లు రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ వి.పి.గౌతం తెలిపారు. ఔటర్ రింగ్ రోడ్డుకు అతి చేరువలోని తొర్రూర్ ప్రాంతంలో 200 – నుంచి 500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న125 ప్లాట్లు, కుర్మల్గూడ లో 200ల నుంచి -300 చదరపు గజాల విస్తీర్ణంలోని 25 ప్లాట్లు, బహదూర్ పల్లిలో 200ల నుంచి -1,000 గజాల్లోని 13 ప్లాట్లను విక్రయానికి నోటిఫికేషన్ విడుదల చేశారు.
ఎటువంటి వివాదాలు లేని, ఈ ప్లాట్లలో తమ అభిరుచులకు అనుగుణంగా ఇళ్లను నిర్మించుకోవచ్చని, ఈ లే ఔట్లలో ఇప్పటికే మౌలిక వసతుల కల్పన కూడా పూర్తి అయ్యిందని ఎండి వి.పి.గౌతం పేర్కొన్నారు. ఈ ప్లాట్ల కొనుగోలుకు ఆసక్తి ఉన్న వారు ఈ నెల 15 వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని ఆయన తెలిపారు. పెద్ద అంబర్పేట్లోని అవికా కన్వెన్షన్లో నవంబర్ 17,18 తేదీల్లో తొర్రూర్ ప్రాంతంలోని 125 ప్లాట్లకు, 18 వ తేదీ మధ్యాహ్నం నుంచి బహదూర్ పల్లి, కుర్మల్గూడల్లోని ప్లాట్లకు బహిరంగ వేలం నిర్వహిస్తున్నట్లు ఎండి గౌతమ్ పేర్కొన్నారు.
125 ప్లాట్లకు బహిరంగ వేలం
తొర్రూర్లో నచ్చిన ప్లాట్ ఎంపిక కోసం ప్రజలు తరలివచ్చారు. రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ ఆధ్వర్యంలోని ఓపెన్ ప్లాట్ల విక్రయాలపై అనేక మంది ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా తొర్రూర్లోని ప్రాజెక్టు సైట్లో మౌలిక సదుపాయాల గురించి వాకబు చేస్తూ, ఇప్పటికే ఈ లే ఔట్ లో ఇళ్ల్లు కట్టుకొని నివసిస్తున్న వారితో మాట్లాడటంతో పాటు, ప్లాట్ల వాస్తును చూసుకుంటూ ప్రజలు సందడి చేస్తున్నారు. తొర్రూర్ లే ఔట్ లో ఉన్న 885 ప్లాట్లలో విడతల వారీగా ఇప్పటి వరకు 517 ప్లాట్లను విక్రయించారు. మిగిలిన వాటిలో ప్రస్తుతం 125 ప్లాట్లకు బహిరంగ వేలం నిర్వహిస్తున్నారు.