రాష్ట్ర ప్రజలకు చెందిన కోట్లాది రూపాయిల్ని కొల్లగొట్టిన కెసిఆర్ కుటుంబం జూబ్లీహిల్స్లో మాగంటి సునీత సెంటిమెంట్ను ప్రయోగించి పబ్బం గడుపుకోవడానికి ప్రయత్నిస్తోందని రాష్ట్ర మంత్రి, రహమత్ నగర్ డివిజన్ కాంగ్రెస్ ఇంచార్జ్ పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన బోరబండ డివిజన్లో ప్రచారం నిర్వహించారు. బోరబండలోని సాయిబాబ నగర్, జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని వివిధ అసోసియేషన్ సభ్యులు, అర్చకులు మంత్రి పొంగులేటి సమక్షంలో సిఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, రహమత్ నగర్ కార్పోరేటర్ సి.ఎన్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ దివంగత మాగంటి గోపీనాథ్ విషయంలో కెటిఆర్ విలన్ అని సాక్షాత్తూ గోపినాథ్ తల్లి ప్రకటించారని మంత్రి గుర్తు చేశారు. గోపీనాథ్ మృతి ఓ మిస్టరీ అని ఆమె చెప్పడం చూస్తే కల్వకుంట్ల కుటుంభ వైఖరి అందరికీ అర్ధమవుతుందన్నారు. గతంలో వేలాది మంది యువకుల్ని తెలంగాణ ఉద్యమానికి ఆహుతిచ్చిన కెసిఆర్ తరువాత కాలంలో ఎందరో ఉద్యమ నాయకులను పాతాళానికి తొక్కేవారని మంత్రి విమర్శించారు.
తాజాగా కవితను బయటకు పంపి కాళేశ్వరంలో వచ్చిన కమిషన్లో వాటా ఇవ్వకుండా వాటిని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఖర్చు చేస్తున్నారని మంత్రి ఆరోపించారు. కవిత జాగృతి సంస్ధ కార్యకర్తలు ఈ ఎన్నికలో బిఆర్ఎస్కు బుద్ది చెబుతారని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. హీన రాజకీయ చరిత్ర కలిగిన కెసిఆర్ కుటుంబ రాజకీయాలతో మాగంటి గోపీనాధ్ కుటుంబం రోడ్డున పడిందన్నారు. గతంలో ఆంధ్రప్రదేశ్ టిడిపి అధినేత చంద్రబాబును అరెస్ట్ చేసినప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు శాంతియుతంగా నిరసన తెలిపితే ఆ రాష్ట్రానికి పోయి ధర్నాలు చేసుకోవాలన్న కెటిఆర్, ఇప్పుడు తెలుగుదేశం సానుభూతి ప్రజల ఓట్ల కోసం ప్రాకులాడుతున్నారని మంత్రి ఎద్దేవా చేశారు. ప్రజలకు ముఖం చూపించలేక అసెంబ్లీకి రాని కెసిఆర్ ఫాంహౌస్ దాటడం లేదని విమర్శించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పేదలకు నెలకు 23వేల క్వింటాళ్ల సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని మంత్రి తెలిపారు. దేశంలోనే ఇటువంటి పథకం రాష్ట్రంలోనే అమలు చేస్తుంటే ఈ విషయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అవాకులు, చెవాకులు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. సన్న బియ్యం ఆపేస్తామంటూ కాంగ్రెస్ నాయకులు ఎక్కడా చెప్పకపోయినా, కేవలం ఓట్ల రాజకీయంతో కిషన్ రెడ్డి ఇలా మాట్లాడడం సరికాదన్నారు.