5 గంటల వరకు 60.18శాతం పోలింగ్
2020 ఎన్నికలతో పోల్చితే 2.84శాతం అధికం
ఉప ముఖ్యమంత్రి కారుపై దాడి, మాటల యుద్ధం
పాట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికల తొలిదశ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం ఐదు గంటల వరకూ 60.18 శాతం పోలింగ్ నమోదైంది. 2020 నాటి ఎన్నికలతో పోల్చితే 2.84శాతం పోలింగ్ అధికంగా నమోదైంది. గురువారంనాడు జరిగిన తొలిదశ పోలింగ్లో పలు కీలక, వివాదాస్పద స్థానాలు ఉన్నాయి. మొత్తం 121 అసెంబ్లీ స్థానాలకు ఓటింగ్ జరిగింది. సాయంత్రానికి 60.18 శాతం పోలింగ్ నమోదైందని ఎన్నికల సంఘం అధికారులు వెల్లడించా రు. అక్కడక్కడ స్వల్ప ఘర్షణలు చోటు చేసుకున్నాయి. తన కారుపై దుండుగులు దాడికి దిగారని ఉప ముఖ్యమంత్రి విజయ్కుమార్ సిన్హా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఈసీ కలుగచేసుకుని విచారణకు ఆదేశించి నిందితులపై చర్యలకు ఆదేశించింది.
తొలి దశ ఎన్నికల్లో ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, ఉప ముఖ్యమంత్రులు సామ్రాట్ చౌదరి, విజయ్కుమార్ సిన్హా పలువురు మంత్రులు కూడా బరిలో ఉన్నారు. తేజస్వీ యాదవ్ తన కుటుంబానికి గట్టి పట్టున రఘోపూర్ అసెంబ్లీ స్థానం నుంచి బరిలో ఉన్నారు. పోలింగ్ నమోదైన శాతాన్ని బట్టి మెరుగైనదిగానే విశ్లేషకులు భావిస్తున్నారు. ఫలితం ఎటువైపు మొగ్గు చూపుతుందనే విషయంపై ప్రధాన ప్రత్యర్థులు ఎన్డిఎ, ఇండియా కూటములు విశ్లేషణలకు దిగుతున్నాయి.
ఈ దఫా మొత్తం 18జిల్లాల్లో విస్తరించుకుని ఓటింగ్ జరిగింది. ఇందులో బెగూసరాయ్ జిల్లాలో అత్యధికంగా సాయంత్రానికి 67.32 శాతం పోలింగ్ నమోదైంది. తరువాత స్థానంలో సమస్తిపూర్లో 66 శాతం, మాధేపురాలో 65 శాతం ఓటింగ్ రికార్డు అయింది. లఖిసరాయ్లో నాలుగోసారి పోటికి దిగిన ఉప ముఖ్యమంత్రి విజయ్ కుమార్ సిన్హా తన కాన్వాయ్ను ఆర్జేడీ మద్దతుదార్లు నిలిపివేశారని, దాడికి దిగారని ఆరోపించారు. అక్కడి బిసి ఓటర్లను బెదిరించారని ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆర్జెడి ఎంఎల్సి ఆజయ్ కుమార్కు, డిప్యూటీ సిఎంకు నడుమ మాటల యుద్ధం సాగింది. తాగుబోతు, క్రిమినల్ అంటూ పరస్పరం తిట్టుకున్నారు.
మాకు బలమున్న చోట ఓటింగ్ తగ్గించే కుట్ర: ఆర్జెడి
ఇండియా కూటమి బలమున్న చోట్లలో పోలింగ్ శాతం తగ్గేందుకు అధికారులు యత్నించారని ఆర్జేడీ సామాజిక మాధ్యమాలలో ఆరోపించింది. ఈ వాదనను ఎన్నికల సంఘం అధికారులు తోసిపుచ్చారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూనే ప్రశాంతంగా, సజావుగా పోలింగ్ జరిగేలా చూశారని వివరణ ఇచ్చుకున్నారు. పాట్నా నియాజకవర్గంలో సాయంత్రం వరకూ అత్యల్పంగానే ఓటింగ్ రికార్డు అయింది. ఇక్కడ బనిక్పూర్ అర్బన్ నియోజకవర్గంలో 34 శాతం, కుమాహ్రారర్లో 37 శాతానికి పైగా జనం ఓటేశారు. పల్లెలతో పోలిస్తే పట్టణాలలో, నగరాలలో ఓటింగ్ పట్ల ఓటర్లు ఉత్సాహం ప్రదర్శించకుండా ఉంటున్న వైనం ఈ పరిస్థితికి కారణం అని అధికారులు విశ్లేషించారు.