ఉత్తరప్రదేశ్ లోని చునార్ రైల్వేస్టేషన్లో బుధవారం ఉదయం పట్టాలు దాటుతున్న ప్రయాణికులను రైలుఢీకొనడంతో ఆరుగురు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. మృతులు సవిత(28), సాధన ( 16 ) .శివకుమారి ’( 12) అంజుదేవి (20). సుశీలాదేవి (60),కళావతి (50) గా గుర్తించారు. ఈ సంఘటన ఉదయం 9.30 గంటల ప్రాంతంలో జరిగింది. చునార్ స్టేషన్ నాలుగో ప్లాట్ఫారం వద్దకు చోపన్ ప్రయాగ్రాజ్ ఎక్స్ప్రెస్ రైలు వచ్చి ఆగగానే ప్రయాణికులు దిగి ఫుట్ఓవర్బ్రిడ్జి కాకుండా పట్టాలు దాటడానికి ప్రయత్నించారు.
అదే సమయంలో హౌరా కల్కాజీ నుంచి ఎదురుగా వస్తున్న నేతాజీ ఎక్ప్ప్రెస్ రైలు వారిని ఢీకొట్టింది. ఈ ప్రయాణికులు కార్తీక్ పూర్ణిమ స్నానాల కోసం మీర్జాపూర్ వచ్చారని ఎన్సిఆర్ ప్రయాగ్రాజ్ డివిజన్ పిఆర్ఒ అమిత్ సింగ్ వెల్లడించారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, కేంద్ర మంత్రి , స్థానిక ఎంపీ అనుప్రియ పటేల్ మృతుల కుటుంబాలకు తీవ్ర సంతాపం తెలియజేశారు. ప్రమాద స్థలానికి జాతీయ, రాష్ట్ర వైపరీత్యాల స్పందన బృందాలను వెళ్లాలని ఆదేశించారు.