అఖిల్, తేజస్విని జంటగా నటిస్తున్న సినిమా ‘రాజు వెడ్స్ రాంబాయి‘. ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. ‘రాజు వెడ్స్ రాంబాయి‘ చిత్రాన్ని డా.నాగేశ్వరరావు పూజారి సమర్పణలో డోలాముఖి సుబల్టర్న్ ఫిలింస్, మాన్సూన్స్ టేల్స్ బ్యానర్స్పై వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవి నిర్మిస్తున్నారు. సాయిలు కంపాటి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ నెల 21న ‘రాజు వెడ్స్ రాంబాయి‘ సినిమాను వంశీ నందిపాటి ఎంటర్టైన్మెంట్స్, బన్నీ వాస్ వర్క్ బ్యానర్స్పై వంశీ నందిపాటి, బన్నీ వాస్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొస్తున్నారు. ఈ సినిమా నుంచి ’రాంబాయి నీ మీద నాకు..’ లిరికల్ సాంగ్ ను రాకింగ్ స్టార్ మంచు మనోజ్, భూమా మౌనిక చేతుల మీదుగా రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాకింగ్ స్టార్ మంచు మనోజ్ మాట్లాడుతూ “ఒక పల్లెటూరిలో జరిగిన యదార్ధ ఘటన ఈ సినిమా. జరగకూడని ఘటన అది. ఈ సినిమా బ్లాక్బస్టర్ హిట్ అవుతుంది. అన్ని అవార్డులు ఈ సినిమాకు వస్తాయి”అని పేర్కొన్నారు.
నిర్మాత వేణు ఊడుగుల మాట్లాడుతూ “ప్రేమ చాలా ప్రమాదకరమైనది, అది సింహాసనం ఎక్కిస్తుంది, శిలువనూ వేయిస్తుంది. ‘రాజు వెడ్స్ రాంబాయి‘ సినిమా కథ దర్శకుడి ఊహలోనుంచో, పుస్తకాల నుంచో, కల్పన నుంచో రాలేదు. ఈ మట్టి నుంచి వచ్చింది. రాజు, రాంబాయి ప్రేమే ఈ సినిమాను నిలబెడుతుందని నమ్ముతున్నా”అని అన్నారు. నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ వంశీ నందిపాటి మాట్లాడుతూ “ఒక్క డైలాగ్, ఒక్క పాట కోసం ‘రాజు వెడ్స్ రాంబాయి‘ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. ఆ పాట ఇదే”అని తెలియజేశారు. డైరెక్టర్ సాయిలు కంపాటి మాట్లాడుతూ “ప్రేమికులు ఈ సినిమాను చూసి నవ్వుతారు, ఏడుస్తారు. సినిమా చూస్తున్న వాళ్లకు వాళ్ల ప్రేమ గుర్తుకొస్తుంది. ఈ పాట ఎంత బాగుందో సినిమా అంత బాగుంటుంది”అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంచు మనోజ్ సతీమణి భూమా మౌనిక, సాయికృష్ణ, నితిన్, హీరో అఖిల్ ఉడ్డెమారి, హీరోయిన్ తేజస్వినీ రావ్, శివాజీ రాజా, చైతు జొన్నలగడ్డ, మిట్టపల్లి సురేందర్, సురేష్ బొబ్బిలి, రాహుల్ మోపిదేవి, నల్లగొండ గద్దర్ నర్సన్న పాల్గొన్నారు.