మన తెలంగాణ/నాగర్కర్నూల్ ప్రతినిధి: కెసిఆర్ అధికారంలో ఉండి అవలంబించిన విధానాలు.. పోరాడి సాధించుకున్న తెలంగాణ స్ఫూర్తికి విరుద్ధమని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. నాగర్ కర్నూల్ జిల్లా, మన్నెవారిపల్లి వద్ద నేషనల్ జియో ఫిజికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ శాస్త్రవేత్తల నేతృత్వం లో హెలిబోర్నో ఏరియల్ ఎలక్ట్రో మాగ్నెటిక్ సర్వేను ప్రారంభించడానికి వచ్చిన ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పదేళ్లపాటు ముఖ్యమంత్రిగా ఉండి రెండు లక్షల ఇర వై వేల కోట్ల రూపాయలను సాగునీటి ప్రాజెక్టులపై ఖర్చు చేసి ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేకపోయారని ఆరోపించా రు. పదేళ్లలో ఎస్ఎల్బిసి ప్రాజెక్టును రెండు కిలోమీటర్ల మేర తొవ్వడం అంటే ఈ ప్రాజెక్టు పూర్తయితే మూడు లక్షల ఎకరాలకు సాగునీరు అందితే ఆ క్రెడిట్ కాంగ్రెస్కు దక్కుతుందన్న దుర్బుద్ధితో నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. 1985లో 2 వేల 6 వందల కోట్ల వ్యయంతో ప్రారంభించిన ప్రాజెక్టు క్రమంగా అంచనా వ్యయం రూ.4,600 కోట్లకు పెరిగిందన్నారు.
ప్రస్తుతం ఇంతే వ్యయంతో అధునాతన ప్రపంచంలోని అధునాతన టెక్నాలజీని వినియోగిస్తూ ఎన్నో ఒడిదుడుకులు, అడ్డంకులను అధిగమిస్తూ రెండేళ్లలో ఎస్ఎల్బిసి ప్రాజెక్టును పూర్తి చేయాలన్న సంకల్పంతో తమ ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికతో ముందుకు సాగుతోందని అన్నారు. ఎస్ఎల్బిసి విషయంలో ప్రజలలో అపోహలు సృష్టించే విధంగా మాట్లాడడం మానుకోవాలని బిఆర్ఎస్ నేత హరీశ్రావుకు హితవు పలికారు. కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల సాగునీటి ప్రాజెక్టుల పట్ల చిత్తశుద్ధితో పనిచేస్తున్న తమపై కెసిఆర్, హరీశ్రావు చిల్లర మాటలు మానుకోవాలని హితవు పలికారు. పదేళ్లు అధికారంలో ఉండి ఏ ఒక్క ప్రాజెక్టును కూడా పూర్తి చేయకపోవడం వల్లే నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులు నీటి వాటాల విషయంలో కొర్రీలు పెడుతోందని ్డ అన్నారు. పదేళ్ల కాలంలో ప్రాజెక్టులు పూర్తి చేసి సాగునీరు అందించి ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అలుసు దొరికేది కాదని అన్నారు. తక్కువ వ్యాయాయంతో ఎత్తిపోతల లేకుండా గ్రావిటీ ద్వారా 3 లక్షల ఎకరాలకు సాగినీరు అందించే బృహత్తర ప్రాజెక్టును కెసిఆర్ పూర్తిగా నిర్లక్ష్యం చేశారని దుయ్యబట్టారు. తెలంగాణకు దక్కాల్సిన నీటి వాటాపై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 811 టిఎంసిలు ఉంటే తెలంగాణకు 299 టిఎంసిలు కృష్ణాజలాలలో కేటాయించడానికి కేంద్రం సమావేశాలు నిర్వహిస్తే సంతకాలు పెట్టి తెలంగాణ హక్కులను హరించే విధంగా కెసిఆర్ పాల్పడ్డారని ఆరోపించారు.
సహజ న్యాయసూత్రాల ప్రకారం కృష్ణా జలాలలో నీటి వాటా కోసం తమ ప్రభుత్వం పోరాడుతుందని, తమ వాదనలు ఒక కొలిక్కి వస్తున్నాయని, కృష్ణా జలాలలో తమ హక్కుగా రావాల్సిన వాటను దక్కించుకొని తీరుతామని ధీమా వ్యక్తం చేశారు. ఎస్ఎల్బిసి ప్రాజెక్టును రెండేళ్లలో పూర్తి చేయడానికి గ్రీన్ఛానల్ విధానం ద్వారా అనుమతులు నిధులు కేటాయిస్తామని అన్నారు. 9.8 కిలోమీటర్ల నిర్మించాల్సి ఉన్న టన్నెల్ పనుల కోసం ఆచితూచి అడుగులు వేస్తున్నామని, ప్రపంచంలోనే అత్యున్నత ప్రమాణాలతో కలిగిన సర్వేలు విధానాలను వినియోగిస్తూ ముందుకు పోతున్నట్లు వివరించారు. అడువులు, పులుల అభయారణ్యం, కృష్ణా నది పరివాహక ప్రాంతాన్ని దృష్టిలో ఉంచుకొని 9.8 కిలోమీటర్ల మేర తవ్వే టన్నెల్ పనుల కోసం అధునాతన శాస్త్ర సాంకేతిక రంగాలను వినియోగించి రెండేళ్లలో ప్రాజెక్టును పూర్తి చేస్తామని అన్నారు. మన వాటా మనం వాడుకోకపోవడం అంటే హక్కులను వదులుకున్నట్లే అన్నారు. ఈ ప్రాంత బిడ్డగా ఇప్పుడు ఈ ప్రాజెక్టును పూర్తి చేసుకోకపోతే ఎప్పటికీ ఈ ప్రాజెక్టును పూర్తి చేయలేరని అన్నారు. ఆరు నూరైనా ప్రాజెక్టును పూర్తి చేసి 3 లక్షల ఎకరాలకు సాగునీరు 30 లక్షల కుటుంబాలకు తాగునీరు అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని అన్నారు. ఎస్ఎల్బిసి ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్కు చెందిన పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుకు ప్రత్యామ్నాయమని అభివర్ణించారు.
ఆరు నూరైనా ప్రాజెక్టును రెండేళ్లలో పూర్తిచేస్తాం
ఆరు నూరైనా రాబోయే రెండేళ్లలో ఎస్ఎల్బిసి ప్రాజెక్టును పూర్తి చేస్తాము అని ముఖ్యమంత్రి అన్నారు. శ్రీశైలం ఎడమ గట్టు కాలువ ఎస్ఎల్బిసి టన్నెల్ పనులను ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తిచేయాలని ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉందని పునరుద్ఘాటించారు. ఎన్ని అడ్డంకులొచ్చినా తొలగించుకుంటూ ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. ఎస్ఎల్బిసి టన్నెల్ పనుల కోసం నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఎన్జిఆర్ఐ శాస్త్రవేత్తల నేతృత్వంలో అచ్చంపేట మండలం, మన్నెవారిపల్లి వద్ద ముఖ్యమంత్రి సమక్షంలో హెలికాప్టర్ ద్వారా హెలిబోర్న్ ఏరియల్ ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ సర్వే ప్రారంభమైంది. సర్వే విధానాన్ని ముఖ్యమంత్రి స్వయంగా పరిశీలించారు. అనంతరం మరో హెలికాప్టర్ ద్వారా సర్వే చేస్తున్న హెలికాప్టర్ను అనుసరిస్తూ సర్వే విధానాన్ని స్వయంగా పరిశీలించారు.
రెండు దశాబ్దాల పెండింగ్ ప్రాజెక్టును గాడిలో పెడుతున్నాం
రెండు దశాబ్దాల కాలంగా పెండింగ్లో ఉన్న ఈ ప్రాజెక్టును తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరిగి చేపట్టామని అన్నారు. ఆ క్రమంలో ఎదురైన అనుభవాలను దృష్టిలో పెట్టుకుని మిగిలిపోయిన 9.8 కిలోమీటర్ల పనుల కోసం ఎన్జిఆర్ఐ శాస్త్రవేత్తలు, టన్నెల్ నిర్మాణాల్లో అనుభవం కలిగిన ఆర్మీ అధికారుల సేవలను వినియోగించి ముందుకు వెళుతున్నామని అన్నారు. ఎన్జిఆర్ఐ నేతృత్వంలో నిర్వహిస్తున్న సర్వే వల్ల భూగర్భంలో 800 నుంచి 1000 మీటర్లలోపు ప్రతి 2.5 మీటర్లలో రాయి, నీటి ప్రవాహాలకు సంబంధించిన పరిస్థితి ఎలా ఉందన్నది తెలుస్తుందని అన్నారు. ఈ ప్రాజెక్టు ప్రాంతమంతా టైగర్ రిజర్వ్ ఉందని, పర్యావరణం విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఎలాంటి అవాంతరాలు లేకుండా టన్నెల్ నిర్మాణ పనులు పూర్తిచేయాలని సంకల్పంతో ఉన్నామన్నారు.
గ్రావిటీ ద్వారా 30 టిఎంసిలను 3 లక్షల ఎకరాలకు సాగునీరు, 30 లక్షల మందికి తాగునీరు సరఫరాకు ఉద్దేశించిన ఈ ప్రాజెక్టుకు 1983 లో పునాది పడినప్పటికీ ఆ తర్వాత రెండు దశాబ్దాల పాటు పనులు జరగలేదు. తిరిగి 2004లో నల్గొండ జిల్లా ప్రజాప్రతినిధుల ఒత్తిడి మేరకు ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ప్రాజెక్టు టన్నెల్-1, టన్నెల్ 2 పనులు ప్రారంభమయ్యాయని అన్నారు. గ్రావిటీ ద్వారా నీటిని తరలించే ఈ ప్రాజెక్టు 44 కి.మీ టన్నెల్ కోసం ఆనాడు దాదాపు 33 కి.మీ పూర్తి చేయగా, గత ప్రభుత్వ హయాంలో దశాబ్దకాలం ఈ ప్రాజెక్టు పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని ఆరోపించారు. ప్రాజెక్టును ప్రారంభించిన నాడు ప్రపంచంలోనే అత్యంత అధునాతన టన్నెల్ బోర్ మిషన్ ఉపయోగించి ప్రయోగాత్మకంగా పనులు చేపట్టారని తెలిపారు.
దేశంలోనే అత్యుత్తమ ప్రాజెక్టు
దేశంలోనే ఇదొక అత్యుత్తమ ప్రాజెక్టు. 44 కి.మీ టన్నెల్ ప్రాజెక్టు ప్రపంచంలోనే మరెక్కడా లేదని సిఎం అన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే తెలంగాణకు మంచి పేరు రావడమే కాకుండా నయా పైసా ఖర్చు లేకుండా గ్రావిటీతో నీటిని సరఫరా చేయొచ్చునని అన్నారు. ప్రస్తుతం ఏఎంఆర్ ప్రాజెక్టు ద్వారా తరలిస్తున్న నీటికి కేవలం విద్యుత్ చార్జీల కోసం ఏటా 500 కోట్ల రూపాయలు చెల్లించాల్సి వస్తోందని, గడిచిన పదేండ్లలో కేవలం విద్యుత్ చార్జీలే 5 వేల కోట్లు చెల్లించారని తెలిపారు. ఎస్ఎల్బిసితో పాటు కృష్ణా నదిపై బీమా, నెట్టంపాడు, కోయిల్సాగర్ లాంటి ప్రాజెక్టులను పూర్తి చేయకపోవడం వల్ల సాధించుకున్న తెలంగాణ లక్ష్యం నెరవేరలేదు. కృష్ణా నదిపై ఏ ఒక్క ప్రాజెక్టును కూడా పూర్తి చేయని కారణంగా మన వాటా మనం వాడుకోలేకపోయామని అన్నారు. నికర జలాల హక్కులు కలిగినప్పటికీ పదేండ్లలో ఏ ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయకపోవడంతో తెలంగాణలోని ప్రాజెక్టులపై ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు అభ్యంతరం చెబుతోందని అన్నారు.
తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్ఎల్బిసిని పూర్తి చేయాలని సంకల్పంతో ముందుకు వెళ్లినప్పుడు ఊహించని ప్రమాదం సంభవించిందని, ఇది తమకెంతో బాధ కలిగించిందని, ప్రమాదంలో మరణించిన కుటుంబాలను ఆదుకున్నామని తెలిపారు. అందుకే అనుభవం, అత్యంత నైపుణ్యం ఉన్న వారిని ఇక్కడికి రప్పించామని, ప్రాజెక్టును పూర్తిచేయడానికి భారత సైన్యం నుంచి కూడా అధికారిని డిప్యుటేషన్పై తెచ్చుకున్నాం.ఈ క్రమంలో టన్నెల్ పనులను ముందుకు తీసుకెళ్లడానికి భూగర్భంలో ఉన్న పరిస్థితులను అధ్యయనం చేయడానికి ఈ సర్వేను చేపట్టామని తెలిపారు. పైగా అదనంగా పైగా ఖర్చు లేకుండా ఆనాడు వేసిన అంచనాలతోనే ఈనాడు పనులు పూర్తి చేయనున్నాం. నీటి పారుదల ప్రాజెక్టుల విషయంలో ఉమ్మడి మహబూబ్నగర్, నల్గొండ జిల్లాలకు ఇప్పటికే తీవ్ర నష్టం వాటిల్లిందని, ఈ ప్రాజెక్టును పూర్తి చేయకపోతే ప్రజలు క్షమించరని అన్నారు. ఇప్పుడు పూర్తి చేసుకోలేకపోతే మరెప్పుడూ పూర్తి చేసుకోలేం. ఎన్ని అడ్డంకులొచ్చినా తొలగించుకుంటూ దీన్ని పూర్తి చేసుకోవలసిన బాధ్యత అందరిపైనా ఉందని అన్నారు.
నిధులకు ఎలాంటి ఆటంకం లేదు. గ్రీన్ చానెల్ ద్వారా మంజూరు చేస్తాం
ప్రాజెక్టు పనులను పూర్తి చేయడానికి మర్లపాడు తండా, కేశీ తండా, నక్కలగండి తాండా వాసులకు డిసెంబర్ 31 నాటికి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ చెల్లింపులు పూర్తి చేస్తామని తెలిపారు. ఈ ప్రాజెక్టు కింద భూములు కోల్పోతున్న వారికి ఎలాంటి నష్టం లేకుండా ఆదుకునే బాధ్యత ప్రభుత్వానిది.. అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సాగునీటి శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి, రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అచ్చంపేట ఎంఎల్ఎ వంశీకృష్ణ, దేవరకొండ ఎంఎల్ఎ బాలు నాయక్, నాగర్ కర్నూల్ జిల్లా ఇన్చార్జి కలెక్టర్ ఆదర్శ్ సురభి, డిఐజి చౌహన్, జిల్లా ఎస్పి గైక్వాడ్ వైభవ్ రఘునాథ్, అదనపు కలెక్టర్లు అమరేందర్, దేవ సహాయం, నేషనల్ జియో ఫిజికల్ రీసెర్చ్ ఇనిస్ట్యూట్ డైరెక్టర్ ప్రకాష్ కుమార్, శాస్త్రవేత్త డాక్టర్ సత్యనారాయణ, నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు, వివిధ శాఖల ఉన్నతాధికారులు, తదితరులు ఇతర ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.