చేపలను ప్రజల ఆహారంలో భాగస్వామ్యం చేసుకునేలా ప్రచార ప్రణాళికలు రూపొందించాలని మత్స్య శాఖ మంత్రి వాకిటి శ్రీహరి -అధికారులను ఆదేశించారు. నవంబర్ చివరి నాటికల్లా చేప పిల్లల పంపిణీ పూర్తి కావాలని, అందుకు అనుగుణంగా ప్రజాప్రతినిధులను కలుపుకొని పంపిణీ చేసేవిధంగా ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు. గతంలో ఎన్నడూలేని విధంగా ప్రభుత్వం రూ.123 కోట్ల బడ్జెట్ను కేటాయించిందని తెలిపారు. సోమవారం నాడు డా బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో చేపపిల్లల పంపిణీపై 32 జిల్లాల కలెక్టర్లు, మత్స్య శాఖ అధికారులతో మత్స్యశాఖ మంత్రి వాకిటి శ్రీహరి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ హయంలో చేప పిల్లల పంపిణీలో అవకతవకలు జరిగాయని తెలిపారు. జిల్లా కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని చేపపిల్లల పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని, ప్రతి వారం ఇందుకు సంబంధించిన పురోగతిని రాష్ట్ర స్థాయి అధికారులకు నివేదిక అందజేయాలని ఆదేశించారు.
మాంసం భుజించడంలో మొదటి స్థానంలో ఉన్న తెలంగాణ చేపలను భుజిచడంలో వెనుకబడి ఉందన్న మంత్రి చేపల భుజించడం వల్ల జరిగే ఆరోగ్యపరమైన లాభాలపై విస్తృత ప్రచార ప్రణాళికలు రూపొందించాలని అధికారులు ఆదేశించారు. మత్స్యశాఖపై ఉన్న అభియోగాన్ని మార్చేందుకు ప్రతి చెరువు వద్ద చేప పిల్లల పంపిణీ వివరాలు తెలిసేలా సైన్ బోర్డు ఏర్పాటు చేయాలని సూచించారు. చేప పిల్లల పంపిణీ ప్రక్రియను ప్రభుత్వం నియమ నిబంధనలు అనుగుణంగా టి మత్స్య యాప్లో అప్లోడ్ చేయాలని సూచించారు. కృష్ణా, గోదావరి జీవనదులు, గొలుసు కట్టు చెరువులు ఉన్న ప్రాంతం మనకు ఉందని, చేపల ఉత్పత్తి పెంచడమే లక్ష్యంగా ఉత్పత్తి కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆయన వివరించారు. ఉత్పత్తితో పాటు మార్కెటింగ్ సదుపాయం పెంచాలని అన్నారు. ప్రతి నియోజకవర్గంలో ఫిష్ రిటైల్ అవుట్ లెట్ మార్కెట్ కోసం ప్రభుత్వ స్థలాలను కలెక్టర్లు కేటాయించాలని సూచించారు. వివిధ రాష్ట్రాల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో చేపల వంటకం అమలును పరిశీలిస్తున్నామని తెలిపారు.
తెలంగాణ రాష్ట్రంలో అమలుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చిస్తామని తెలిపారు. చేప పిల్లల పంపిణీపై జిల్లా కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని అన్నారు. ఈ సమావేశంలో మత్స్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సవ్యసాచి ఘోష్, ఫిషరీస్ డైరెక్టర్ నిఖిల, అడిషనల్ డెరైక్టర్ శ్రీనివాస్, తదితర అధికారులు పాల్గొన్నారు.