మన తెలంగాణ / హైదరాబాద్ : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో సిపిఐ బలపరిచిన కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఇటి నరసింహా అన్నారు. ఆదివారం నియోజకవర్గం పరిధిలోని ఎల్లారెడ్డి గూడ డివిజన్ లో సిపిఐ నేతలు నవీన్ యాదవ్కు మద్దతుగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈటి నరసింహ మాట్లాడుతూ బిఆర్ఎస్ పదేళ్ల పాలనలో ప్రజలను, ప్రజల అవసరాలను పట్టించుకోలేదని, ఒంటెద్దు పోకడలతో రాష్ట్ర అభివృద్ధిని నిర్లక్ష్యం చేస్తూ కుటుంబ పాలన కొనసాగించారని విమర్శించారు. బిఆర్ఎస్ పాలనలో విద్యావ్యవస్థ, వైద్యం, ఉపాధిని పట్టించుకోకుండా అధికార వ్యామోహంతో నిరంకుశంగా వ్యవహరించారని అన్నారు. మరోపక్క బిజెపి సున్నితమైన హైదరాబాద్ నగరంలో మత విద్వేషాలు రెచ్చగొట్టడం ద్వారా పార్టీ బలపడాలని చూస్తోందని ఎద్దేవా చేశారు. కేంద్ర ప్రభుత్వం యువతకు ఇచ్చిన ఉద్యోగ హామీని నిలుపుకోలేకపోయిందని, పునర్విభజన తర్వాత తెలంగాణకు రావలసిన నిధులను కేటాయింపులో విఫలమైందని అన్నారు. నియంతృత్వ కుటుంబ పాలనను గద్దె దించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం విద్యారంగాన్ని ప్రక్షాళన చేసే దిశగా విద్యా కమిషన్ ఏర్పాటుచేసిందని, రాష్ట్రంలో ఒక నూతన విద్యా విధానాన్ని తీసుకొచ్చేందుకు ఒక కొత్త కమిటీని ఏర్పాటు చేసిందన్నారు. పేదలకు ఉచిత వైద్యం అందుబాటులో ఉండేందుకు నూతన ప్రదేశంలో ఉస్మానియా ఆసుపత్రి పునర్నిర్మాణానికి ముందడుగు వేసిందని, రాష్ట్రంలో మహిళల ఆర్థిక స్థిరత్వం కోసం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని,నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్ల పేరిట నూతన గృహాలు కట్టించి సమగ్రమైన అభివృద్ధికి పట్టం కడుతోందని అన్నారు. ప్రచారంలో రాష్ట్ర సిపిఐ కార్యదర్శి వర్గ సభ్యుడు వి ఎస్ బోస్ ,హైదరాబాద్ జిల్లా కార్యదర్శి స్టాలిన్, సహాయ కార్యదర్శి కమతం యాదగిరి, జిల్లా కార్యవర్గ సభ్యులు కాంపల్లి శ్రీనివాస్, నేర్లకంటి శ్రీకాంత్, బాలకృష్ణ, నరసింహ, అడ్వకేట్ నాగేష్ ,లెనిన్,యాదిలాల్, భీముడు, ఉదయ్ కుమార్, అశ్వన్, సుమన్ తదితరులు పాల్గొన్నారు.