బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు జూబ్లీహిల్స్ ఎన్నికల సందర్భంగా ఓటుకు 5 వేల చొప్పున ప్రస్తావన తెచ్చిన అంశాన్ని ఎన్నికల కమిషన్ సీరియస్గా తీసుకుని సుమోటోగా కేసు నమోదు చేయాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. ఈ మేరకు ఆయన శనివారం ఒక వీడియో విడుదల చేశారు. పది సంవత్సరాల పాలనలో అక్రమంగా సంపాదించిన అహంకారంతో జూబ్లీహిల్స్ ఓటర్లను కొనుగోలు చేసే పద్ధతిలో ఓటు కి రూ.5 వేలు అడుక్కోవాలని కెటిఆర్ ఓటర్లకు పిలుపు ఇవ్వడం పట్ల ఆయన తీవ్ర అభ్యంతరం తెలిపారు.. దీనిపై ఎన్నికల కమిషన్కు కాంగ్రెస్ పార్టీ పక్షాన ఫిర్యాదు చేయనున్టనుల ఆయన చెప్పారు. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఓటుకు రూ.6 వేలు ఇచ్చిన సంస్కృతి బిఆర్ఎస్ పార్టీది అని ఆయన ఆరోపించారు. ప్రజల అభిమానంతో అభివృద్ధి చేస్తూ.. మరింత అభివృద్ధి చేస్తామని విశ్వాసం కలిగిస్తూ ఓట్లు అడుగుతున్నామని అన్నారు.
జూబ్లీహిల్స్ ప్రజలు ఆలోచన కలిగినవారని, కంటోన్మెంట్ ఉప ఎన్నిక తరహాలో జూబ్లీహిల్స్లోనూ కాంగ్రెస్కి ఓటు వేసి గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు. పేద కుటుంబాలకు తాము 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ. 500కి గ్యాస్, నూతన రేషన్ కార్డులు, సన్న బియ్యం పంపిణీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, వడ్డీలేని రుణాలు, నూతనంగా ఉద్యోగాలు ఇచ్చాం, హైదరాబాద్ అభివృద్ధి చేస్తూ తాగు నీరు, డ్రైనేజీ, రోడ్లు మరిన్ని మౌలిక సదుపాయాలు కల్పించామన్నారు. తమ పార్టీ అభ్యర్థి చదువుకున్న వ్యక్తి అని, పని చేయగలిగే శక్తి ఉన్న నవీన్ యాదవ్ను ప్రజలు ఆశీర్వదిస్తున్నారని చెప్పారు. ప్రజా పాలన ప్రభుత్వం ప్రజలకు న్యాయం చేయాలనే ప్రభుత్వం ఆలోచిస్తోందన్నారు.
ఉప ఎన్నికల్లో ఓటుకు 5 వేలు తీసుకోండి అని చెప్పిన బిఆర్ఎస్ పార్టీ దుస్థితి చూసి జాలి పడుతున్నామని అన్నారు. కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోవడానికి బిజెపి బిఆర్ఎస్ కుమ్మకై బిజెపి మూడంకెలు దాటని వ్యక్తిని అభ్యర్థిగా పెట్టిందన్నారు. బిజెపికి వేసిన ఓటు బిఆర్ఎస్కి ఓటు వెళుతుందన్నారు. బిఆర్ఎస్కి వేసినా, బిజెపికి వెళుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించి జూబ్లీహిల్స్ అభివృద్ధిని కాంక్షించాలని మంత్రి పొన్నం కోరారు.