తనను దేశద్రోహి అంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసి వ్యాఖ్యలపై మంత్రి అజహరుద్దీన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కిషన్ రెడ్డి వ్యాఖ్యలను ఇప్పటికే ఖండించిన అజారుద్దీన్ శనివారం మరోసారి కిషన్రెడ్డిపై వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు. శనివారం మంత్రి అజహరుద్దీన్ విలేకరులతో మాట్లాడుతూ కిషన్ రెడ్డిపై లీగల్ యాక్షన్ తీసుకుంటానని ఆయన హెచ్చరించారు. తనపై వచ్చిన ఆరోపణలపై కోర్టు క్లీన్ చిట్ ఇచ్చిందని దేశ గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిన తాను దేశ ద్రోహినా అని ఆయన ప్రశ్నించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసమే బిజెపి తనను టార్గెట్ చేసిందని మంత్రి అజహరుద్దీన్ దుయ్యబట్టారు. కిషన్ రెడ్డికి క్రికెట్ గురించి ఏం తెలుసనీ, కిషన్ రెడ్డికి కనీసం క్రికెట్ బ్యాట్ అయినా పట్టుకోవడం వచ్చా అని మంత్రి అజహరుద్దీన్ విమర్శించారు. మాట్లాడటానికి ఏమీ లేక తనపై మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు చేస్తున్నారని, ఆర్నెళ్లలోపు అజహరుద్దీన్ ఎమ్మెల్సీ కాలేరని, ఆయన మంత్రి పదవి కేవలం ఆరునెలల పాటే అంటూ వస్తున్న విమర్శలకు కాలమే సమాధానం చెబుతుందని మంత్రి అజహరుద్దీన్ తెలిపారు.