మన తెలంగాణ/హైదరాబాద్ : వరిధాన్యం కొనుగోళ్లపై రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అధికారులను ము ఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ధా న్యం సేకరణకు అత్యంత ప్రాధాన్యతనివ్వాలని సిఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూ చించారు. వివిధ జిల్లాల్లో కురిసిన వర్షాలు, జరిగిన నష్టాన్ని జిల్లా కలెక్టర్లు సిఎంకు వివరించారు. వాతావరణశాఖ హెచ్చరికల దృష్ట్యా ముందస్తు చర్యలు తీసుకున్నామని అధికారులు సిఎంతో తెలిపారు. దెబ్బతిన్న పంటలు, రహదారులకు సం బంధించిన ప్రాథమిక వివరాలను ముఖ్యమంత్రి దృష్టికి వారు తీసుకెళ్లారు. కేంద్ర ప్ర భుత్వం నుం చి పొందే వరదసాయం అం శాల గురించి అధికారులతో సిఎం
చర్చించారు. ఈ నేపథ్యంలోనే తుపాన్ ప్రభావిత ప్రాంతాల జిల్లా కలెక్టర్లు, అధికారులతో సిఎం రేవంత్ రెడ్డి గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ధాన్యం సేకరణ కేంద్రాల దగ్గర క్షేత్రస్థాయిలో తీసుకోవాల్సిన చర్యలపై పౌరసరఫరాల విభాగం ఎప్పటికప్పుడు కలెక్టర్లకు తగిన సూచనలు చేయాలని ఆయన సూచించారు. ప్రతి కొనుగోలు కేంద్రానికి మండల స్థాయి అధికారిని ప్రత్యేక అధికారిగా నియమించి బాధ్యతలు అప్పగించాలని సిఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. అవసరమైన చోట ధాన్యాన్ని దగ్గరలోని ఫంక్షన్స్ హాల్స్కు తరలించేలా చర్యలు తీసుకోవాలన్నారు.
స్థానికులను ముందుగానే అలర్ట్ చేయాలి
ప్రతి ధాన్యం కొనుగోలు కేంద్రం నుంచి ప్రతి 24 గంటల పరిస్థితిపై ప్రతిరోజూ కలెక్టర్కు నివేదిక అందించాలని సిఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. 24 గంటలకు ఒకసారి నివేదిక ఇవ్వకుండా నిర్లక్ష్యం వహించే అధికారులపై తక్షణం చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కలెక్టర్లను ఆదేశించారు. ప్రతి ఒక్కరూ ఫీల్డ్లో ఉండాల్సిందేనని అధికారులను సిఎం రేవంత్ ఆదేశించారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ సంయుక్తంగా మానిటరింగ్ సెంటర్ ఏర్పాటు చేసుకోవాలని సిఎం సూచించారు. దెబ్బతిన్న రోడ్ల పరిస్థితిని ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ట్రాఫిక్ను డైవర్ట్ చేయాలని సిఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. చెరువులు, వాగులు, మేజర్, మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు, లో లెవల్ కల్వర్టుల దగ్గర పరిస్థితులను గుర్తించి స్థానికులను ముందుగానే అలర్ట్ చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. అన్ని విభాగాలు సంయుక్తంగా పనిచేయాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి
అధికారులు అప్రమత్తంగా ఉంటూ క్షేత్రస్థాయిలో పర్యటించాలని, సిబ్బంది సెలవులు రద్దు చేసి క్షేత్రస్థాయిలో పర్యటించేలా కలెక్టర్లు చూడాలని సిఎం రేవంత్ ఆదేశించారు. విద్యుత్ అంతరాయం లేకుండా అప్రమత్తంగా వ్యవహారించాలని, దెబ్బతిన్న రోడ్ల వద్ద ట్రాఫిక్ను మళ్లీంచాలని సిఎం అధికారులకు సూచించారు. అత్యవసర వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని, వరంగల్లో అవసరమైతే హైడ్రా సేవలు వినియోగించుకోవాలని సిఎం రేవంత్రెడ్డి సూచించారు. జిల్లా ఇన్చార్జీ మంత్రికి కలెక్టర్లు సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలియచేయాలని, ప్రాణ, ఆస్తి, పంట నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సిఎం రేవంత్రెడ్డి ఆదేశించారు.
డ్రోన్ల ద్వారా ఆహారం, నీరు అందించాలి
వరంగల్లో వరద బాధితులకు సహాయక చర్యలను ముమ్మరం చేయాలని సిఎం రేవంత్ ఆదేశించారు. అవసరమైనన్నీ పడవలను వెంటనే వరద ప్రభావిత ప్రాంతాలకు పంపించాలని సిఎం సూచించారు. ఎస్డిఆర్ఎఫ్ సిబ్బందిని తక్షణమే వరద ప్రభావిత ప్రాంతాలకు తరలించాలని ఆయన ఆదేశించారు. హైడ్రా సిబ్బందిని, సహాయ సామగ్రిని కూడా ఉపయోగించుకోవాలని, ముంపు ప్రాంతాల్లో ఉన్న వారిని వెంటనే సురక్షిత ప్రాంతానికి తరలించాలని, వరదల్లో చిక్కుకున్న వారికి డ్రోన్ల ద్వారా ఆహారం, నీరు అందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. వరద సహాయక చర్యలకు అన్ని ప్రణాళికలను సిద్ధం చేస్తున్నామని అధికారులు తెలిపారు.
జిల్లాల ఇన్చార్జీ మంత్రులు క్షేత్రస్థాయిలో పర్యటించాలి
వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. శుక్రవారం వరంగల్, హుస్నాబాద్ ప్రాంతాల్లో సిఎం రేవంత్రెడ్డి పర్యటించనున్నారు. ప్రతికూల వాతావరణం వల్ల గురువారం వరంగల్ పర్యటనను వాయిదా వేసుకున్నానని సిఎం అధికారులతో తెలిపారు. తుఫాను ప్రభావిత జిల్లాల ఇన్చార్జీ మంత్రులు క్షేత్రస్థాయిలో ఉండాలని, మంత్రులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని సిఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకునే ప్రయత్నం చేయాలని, ప్రజలను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని సిఎం హామీనిచ్చారు. వరద సహాయక చర్యలకు అన్ని ప్రణాళికలను సిద్ధం చేస్తున్నామని ముఖ్యమంత్రి వివరించారు. ఈ సమావేశంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, ఉత్తమ్కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, కొండా సురేఖ, వాకిటి శ్రీహరి పాల్గొన్నారు.