మన తెలంగాణ/హైదరాబాద్: జూబ్లీహిల్స్ ని యోజకవర్గంలో ప్రజలు ఇచ్చే తీర్పుతో కాంగ్రెస్ కి బుద్ధి వస్తుందని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అన్నారు. ఈ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పరాజయం తప్పదని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ మోసాలు, ఘోరాలపై ఆగ్రహంగా ఉన్న ప్రజానీకం ఆ పార్టీని తిరస్కరిస్తారని చెప్పారు. జూబ్లీహిల్స్లో జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ డిపాజిట్ కోల్పోతేనే రాష్ట్ర ప్రజలకు ఆ పార్టీ ఇచ్చిన 420 హామీలు, ఆరు గ్యారెంటీలు అమలు అవుతాయని వ్యాఖ్యానించారు. ఓటమి భయంతోనే కాంగ్రెస్ పార్టీ ఆపదమొక్కులకు పోతున్నదని, అందుకే ఇన్ని రోజులు గుర్తుకురాని మైనార్టీల నుంచి ప్రభుత్వ ఉద్యోగులు, సినీ కార్మికుల దాకా అందరికీ ఏదో చేస్తామని మరోసారి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నదని విమర్శించారు. బిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత తరపున ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ శుక్రవారం ప్రచారం నిర్వహించారు. షేక్పేటలో బిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత, బిఆర్ఎస్ నేతలతో కలిసి కెటిఆర్ భారీ రోడ్ షో నిర్వహించారు.
ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్లో గెలుపు పక్కా.. కానీ, మెజార్టీ ఎంతో తేలాల్సి ఉందని విశ్వాసం వ్యక్తం చేశారు. రెండేళ్లలో ఒక్క హామీని కూడా కాంగ్రెస్ నిలబెట్టుకోలేదని, ఏ ముఖం పెట్టుకొని ఓట్లడుగుతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇక్కడ 4 లక్షల మంది కాంగ్రెస్కు బుద్ధి చెబితే 4 కోట్ల మంది ప్రజలకు మేలు జరుగుతుందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ చిత్తు చిత్తుగా ఓడిపోతేనే హామీలన్నీ అమలవుతాయని చెప్పారు. పొరపాటున కాంగ్రెస్కు ఓటేస్తే, తాను ఏం చేయకపోయినా ప్రజలు మళ్లీ తనకే ఓటేస్తారని రేవంత్ రెడ్డి అనుకుంటారని హెచ్చరించారు. జూబ్లీహిల్స్ ప్రజలు అమాయకులు అని, పైసలు ఇస్తే ఓట్లేస్తారని రేవంత్ రెడ్డి అనుకుంటున్నారని విమర్శించారు. కాంగ్రెస్ వాళ్లు పైసలు ఇస్తే తీసుకోవాలని.. కానీ, ఓటు మాత్రం కారు గుర్తుకు వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రూ. 5 వేలు ఇస్తే తీసుకొని..మిగితా బాకీ డబ్బులు ఎప్పుడు ఇస్తారని ప్రశ్నించాలని సూచించారు. కారు గుర్తుకు ఓటేసి మాగంటి సునీతను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కెసిఆర్ మళ్లీ ముఖ్యమంత్రిగా రావాలంటే, జైత్రయాత్ర ఇక్కడి నుంచే ప్రారంభం కావాలని అన్నారు.
రెండేళ్లలో ఏ ఒక్కరికీ మేలు జరగలేదు
రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో ఏ ఒక్కరికీ మేలు జరగలేదని కెటిఆర్ విమర్శించారు. అరచేతిలో స్వర్గం చూపిస్తూ 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారని అన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన వాగ్దానాలైన వృద్ధులకు రూ. 4 వేల పెన్షన్, యువతులకు రూ. 2500, ఆడబిడ్డలకు స్కూటీ వంటివి అమలు కాలేదని ప్రశ్నించారు. కెసిఆర్ ఉచితంగా ఇచ్చిన 20 వేల లీటర్ల ఫ్రీ వాటర్ కూడా ఈ ప్రభుత్వం ఇవ్వలేదని మండిపడ్డారు. పేదలకు పథకాలు ఇచ్చే తెలివి లేదు..కెసిఆర్ పథకాలు కొనసాగించే తెలివి కూడా లేదని ఎద్దేవా చేశారు. బతుకమ్మ చీరలు, రంజాన్ తోఫా, క్రిస్మస్ గిఫ్ట్ వంటివి కూడా ఇప్పుడు ప్రజలకు అందట్లేదని అన్నారు. కెసిఆర్ చావు నోట్లో తలపెట్టి కొట్లాడితే ప్రత్యేక రాష్ట్రం వచ్చిందని గుర్తుచేశారు. రాష్ట్రం ఏర్పడినప్పుడు కరెంటు లేదని, ఏమాత్రం బాగాలేని పరిస్థితి ఉండేదని చెప్పారు. నాడు తలసరి ఆదాయం రూ. లక్ష మాత్రమే ఉండేదని తెలిపారు. అనతికాలంలోనే కెసిఆర్ తెలంగాణను నెంబర్ వన్గా తీర్చిదిద్ది, కరెంటు, నీటి సమస్యలను పరిష్కరించారని చెప్పారు. హైదరాబాద్లో 42 ఫ్లైఓవర్లు కట్టామని, వందల కిలో మీటర్ల రోడ్లు వేశామని అన్నారు. పల్లెలను కూడా అభివృద్ధి చేసిన ఘనత బీఆర్ఎస్దేనని పేర్కొన్నారు. వెయ్యికి పైగా గురుకుల పాఠశాలలు, షాదీ ముబారక్, కెసిఆర్ కిట్ వంటి ఎన్నో పథకాలు అమలు చేసి, పుట్టిన బిడ్డ నుంచి పండు ముదుసలి వరకు ప్రతి ఒక్కరికీ మేలు చేశామని వివరించారు. పరిశ్రమలు వచ్చాయని, ఐటీ అభివృద్ధి జరిగిందని తెలిపారు.