యువతీ, యువకుల ప్రేమ వ్యవహారం ఇరు కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రంగారెడ్డి జిల్లా, మంచాల మండల పరిధిలోని ఆరుట్ల గ్రామానికి చెందిన పంబాల నందిని (18), మంకు నాగరాజు (23) ప్రేమించుకున్నారు. వీరిరువురి మధ్య చిన్న గొడవ జరిగి సోమవారం నందిని తన ఇంట్లో ఉరేసుకుని చనిపోయింది. దీంతో మంగళవారం ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు కలిసి నాగరాజుపై చర్యలు తీసుకోవాలని మంచాల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి రోడ్డుపై బైఠాయించారు.
అనంతరం బాధిత కుటుంబానికి పరిహారాన్ని ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇదిలా ఉండగా నందిని మృతి చెందిన విషయం తెలుసుకున్న నాగరాజు ఆరుట్ల నుండి వెళ్లి ఆగపల్లి గ్రామంలోని తన అక్క వద్దకు వెళ్లాడు. అయితే, అప్పటికే మనస్థాపానికి గురైన నాగరాజు ఆగపల్లి నుంచి పెత్తుల్ల గ్రామం వెళ్లే రోడ్డులో ఓ చింతచెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బుధవారం గొర్రెల కాపరి మృతదేహాన్ని చూసి స్థానికులకు తెలపడంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.