మనతెలంగాణ/హైదరాబాద్ : సినీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ ఫండ్ను ఏర్పాటు చేస్తామని, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆ సంక్షేమ నిధికి రూ.10 కోట్లను అందిస్తామని సిఎం రేవంత్రెడ్డి పేర్కొన్నారు. సినిమా ద్వారా వచ్చే ఆదాయంలో కార్మికులకు 20 శాతం వాటా ఇవ్వాలని, భవిష్యత్లో ఎంత పెద్దవారైనా అదనంగా టికెట్ల ధరలు పెంచాలనుకుంటే అందులో 20 శాతం కార్మికుల వెల్ఫేర్ ఫండ్కు అందిస్తేనే జీఓను జారీ చేస్తామని దానికోసం నిబంధనలు సడలిస్తామని సిఎం రేవంత్రెడ్డి తెలిపారు. మంగళవారం సినీ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఏర్పా టు చేసిన అభినందన సభ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, కార్మికసంఘాల అసోసియేషన్ భవన్ నిర్మాణానికి ఆర్థిక సాయం అందిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.
భారత్ ఫ్యూచర్ సిటీలో సినీ ఫైటర్స్ శిక్షణ కోసం స్థలం కేటాయిస్తామని సిఎం రేవంత్రెడ్డి హామీనిచ్చారు. కర్ణుడు ప్రాణం పోయి నా మిత్ర ధర్మం వదలలేదని, అలాగే మీకు అండగా నిలబడాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, మిమ్మల్ని ఆదుకునే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని సిఎం రేవంత్రెడ్డి తెలిపారు. నవంబర్ చివరి వారంలో సినీ కార్మికుల సమస్యలపై మరోసారి సమావేశమవుతామని, డిసెంబర్ 09వ తేదీన ప్రభుత్వం తరపున కార్మికులకు ఏం చేస్తామన్న నిర్ణయాలను వెల్లడిస్తామని ఆయన పేర్కొన్నారు. కార్మికుల సంక్షేమం కోసం ఒక ప్రణాళికతో ముందుకు వెళతామని ఆలోచనలో చిత్తశుద్ధి ఉంటే ప్రకృతి కూడా సహకరిస్తుందని ఆయన అన్నారు.
ప్రభుత్వానికి, సినీ పరిశ్రమకు మధ్య వారధిగా ఉంటా
తెలుగు సినీ పరిశ్రమను హైదరాబాద్ కు తరలించేందుకు ఆనాటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి తీవ్రంగా కృషి చేశారని, అన్న ఎన్టీఆర్, నాగేశ్వర్రావు, కృష్ణ లాంటి వాళ్లు హైదరాబాద్కు సినీ పరిశ్రమ రావడానికి ప్రోత్సాహాం అందించారని సిఎం రేవంత్రెడ్డి తెలిపారు. ఆనాడు డాక్టర్ ప్రభాకర్ రెడ్డి సినీ కార్మికుల కోసం మణికొండలో తన 10 ఎకరాల సొంత స్థలాన్ని ఇచ్చారని, సినీ కార్మికుల కోసం చిత్రపురి కాలనీ ఏర్పాటుకు ఎంతో కృషి చేశారని ఆయన పేర్కొన్నారు. చిత్ర పరిశ్రమలో కళాకారులు ఎంతో కష్టపడి పనిచేస్తున్నారని, రాత్రి పగలు తేడా లేకుండా పనిచేస్తున్న మీ శ్రమ, కష్టం తనకు తెలుసనీ, మీ సమస్యలు తెలుసుకునేందుకే మిత్రుడు దిల్ రాజుకు ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా బాధ్యతలు అప్పగించానని ఆయన తెలిపారు. ప్రభుత్వానికి, సినీ పరిశ్రమకు మధ్య వారధిగా ఉంటారని దిల్ రాజుకు ఆ బాధ్యతలు అప్పగించామని, నిలిపివేసిన నంది అవార్డుల స్థానంలో ప్రజా యుద్ధ నౌక గద్దర్ అవార్డులను అందిస్తున్నామని సిఎం రేవంత్రెడ్డి తెలిపారు.
కార్మికుల పిల్లలకు ఉన్నతమైన చదువు
తెలుగు సినిమాను ఆస్కార్ స్థాయికి తీసుకెళ్లడం వెనుక సినీ కార్మికుల కష్టం ఉందని, హైదరాబాద్ ప్రపంచ సినీ పరిశ్రమకు వేదిక కావాలన్నదే తమ కోరిక అని సిఎం రేవంత్రెడ్డి పేర్కొన్నారు. ‘తెలంగాణ రైజింగ్ 2047’ ప్ర ణాళికతో తమ ప్రభుత్వం ముందుకు వెళుతోందని ఆయ న అన్నారు. ఐటీ, ఫార్మా లాగే సినీ పరిశ్రమకు తమ ప్ర భుత్వం ప్రాధాన్యతనిస్తుందని ఆయన తెలిపారు. ‘తెలంగాణ రైజింగ్ 2047’ ప్రణాళికలో భాగంగా ఫిల్మ్ ఇండస్ట్రీకి ప్రత్యేక చాప్టర్ ఉంటుందన్నారు. మీరంతా అండగా నిలబడాలని, హాలీవుడ్ను ఇక్కడకు తీసుకొచ్చే బాధ్యత తనదని అన్నారు. కృష్ణానగర్లో ఒక మంచి స్థలాన్ని చూడాలని నర్సరీ నుంచి 12 తరగతి వరకు కార్పొరేట్ స్థాయిలో స్కూల్ నిర్మించి సినీ కార్మికుల పిల్లలకు మంచి చదువు చెప్పించే బాధ్యత తాను తీసుకుంటానని, కార్మికుల ఆరోగ్య సమస్యలకు ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్య సౌకర్యం కల్పిస్తామని సిఎం రేవంత్రెడ్డి హామీనిచ్చారు.