మొంథా తుఫాను ప్రభావం పడకుండా చూడాలి
రైతాంగం నష్టపోకుండా జాగ్రత్తలు
ధాన్యంతో పాటు పత్తి, మొక్కజొన్న పంటలు దెబ్బతినకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు
కొనుగోలు కేంద్రాల్లో సరిపడా టార్పాలిన్లు అందుబాటులో ఉంచుకోవాలి
ధాన్యాన్ని సత్వరమే మిల్లులకు తరలించే ఏర్పాట్లు
అధికారయంత్రాంగం సమష్ఠిగా పని చేయాలి
అధికారులు, జిల్లా కలెక్టర్లతో మంత్రులు ఉత్తమ్, తుమ్మల సమీక్ష,
వీడియో కాన్ఫరెన్స్ ఇప్పటి వరకు రూ.431కోట్ల విలువైన ధాన్యం కొనుగోలు
మన తెలంగాణ / హైదరాబాద్: మొంథా తుఫాన్ పట్ల అప్రమత్తంగా ఉండాలని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ముంథా తుఫాన్ తో తెలంగాణాలోనూ అకాల వర్షాల ప్రభావం చూపే అవకాశం ఉందని, ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ మీద తుఫాన్ ప్రభావం పడకుండా చూడాలని కోరారు. వానాకాలం ధాన్యంతో పాటు మొక్కజొన్న, పత్తి పంటలు దెబ్బ తినకుండా ముందస్తు జాగ్రత్తలకు రాష్ట్ర ప్రభుత్వం ఉపక్రమించింది. అందులో భాగంగా సోమవారం సాయంత్రం హైదరాబాద్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి సహచర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, వ్యవసాయ శాఖా ముఖ్య కార్యదర్శి సురేంద్ర మోహన్,కమిషనర్ గోపి,పౌర సరఫరాల శాఖా కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర,పౌర సరఫరాల శాఖా డైరెక్టర్ హనుమంతు కొండుబా, డైరెక్టర్ మార్కెటింగ్ లక్ష్మీ బాయి లతో కలసి మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో పౌర సరఫరాల శాఖాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించడంతో పాటు జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఎట్టి పరిస్థితుల్లోనూ రైతాంగం నష్ట పోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, అందుబాటులో ఉన్న టార్బాలిన్ లను వినియోగించి ఇప్పటికే కొనుగోలు కేంద్రాలకు చేరిన ధాన్యం చెడి పోకుండా చూడాలని కోరారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని సత్వరమే మిల్లులకు తరలించే ఏర్పాట్లు చేయాలని, అందుకు అవసరమైన రవాణా వసతి ఏర్పాటు చేయాలని సూచించారు. 30 నుండి 45 రోజుల వరకు ధాన్యం కొనుగోళ్లలో అధికార యంత్రాంగం సమిష్టిగా పని చేయాలని, అకాల వర్షాలు సంభవిస్తున్న నేపథ్యంలో వరి కోతలు నిలిపి వేస్తే రైతులకు ఇబ్బంది ఉండదన్నారు.
ధాన్యం విలువ 431.09 కోట్లు
రాష్ట్ర వ్యాప్తంగా 8,342 ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నామని, ఇప్పటి వరకు 4,428 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినట్లు మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి వివరించారు. మిగిలిన 3,814 కొనుగోలు కేంద్రాల ప్రారంభానికి ఏర్పాట్లు చేస్తున్నామని, ఇప్పటి వరకు 22,433 మంది రైతుల నుండి ప్రభుత్వం 1,80,452 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసిందని చెప్పారు. అందులో దొడ్డు రకం 73,628 మెట్రిక్ టన్నులు, సన్నాలు 1,06,824 మెట్రిక్ టన్నులుగా ఉన్నాయని అన్నారు. ఇప్పటి వరకు కొనుగోలు చేసిన ధాన్యం విలువ 431.09 కోట్లు అని వివరించారు.
ధాన్యానికి త్వరితగతిన చెల్లింపులు
కొనుగోలు చేసిన ధాన్యానికి త్వరితగతిన చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకోవాలని, ధాన్యం కొనుగోలు కేంద్రాల పై నిరంతర పర్యవేక్షణ జరపాలని సూచించారు. ధాన్యం కొనుగోలులో రైతులకు ఎక్కడా ఆటంకాలు కలుగకుండా చూడాలన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎప్పటికప్పుడు కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, పౌర సరఫరాల శాఖాధికారులు సందర్శించి అక్కడి పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలించాలని, ధాన్యం కొనుగోలు సమయంలో అవినీతి చోటు చేసుకుంటే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. అవినీతి ఆరోపణలు వస్తే చర్యలు కఠినంగా ఉంటాయని, ధాన్యం కొనుగోలు ప్రక్రియను అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ ఈ తరహా ఆరోపణలకు తావు లేకుండా చూడాలన్నారు. ఇది రైతుపక్ష పాత ప్రభుత్వమని, ఏ కారణం చేత నైనా రైతులకు నష్టం వాటిల్లితే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని -మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.