టీమిండియాకు అందించాల్సిన ఆసియాకప్ ట్రోఫీని ఆసియా క్రికెట్ కౌన్సిల్ చైర్మన్ మోసిన్ నఖ్వీ రహస్య ప్రదేశానికి తరలించినట్టు తెలిసింది. అబుదాబిలోని సురక్షిత ప్రాంతంలో ట్రోఫీతో పాటు టీమిండియాకు ఇవ్వాల్సిన మెడల్స్ను దాచిపెట్టినట్టు సమాచారం. టోర్నమెంట్ ముగిసి 20 రోజులు గడిచి పోయినా భారత్ ట్రోఫీని అందించకుండా నఖ్వీ మొండి పట్టుగా వ్యవహరిస్తున్నాడు. తాజాగా ట్రోఫీని ఎవరికి తెలియని రహస్య ప్రాంతానికి తరలించాడని వార్తలు గుప్పుమన్నాయి. కాగా, నఖ్వీ వ్యవహరిస్తున్న తీరుపై భారత క్రికెట్ బోర్డు తీవ్ర ఆగ్రహంతో ఉంది. ట్రోఫీని సాధ్యమైనంత త్వరగా అందించాలని లేకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని ఇప్పటికే హెచ్చరించింది. అయినా కూడా నఖ్వీ మాత్రం మెట్టు దిగడం లేదు. మొండిగా వ్యవహరిస్తూ అందరిని విస్మయానికి గురి చేస్తున్నాడు.