మనతెలంగాణ/హైదరాబాద్ : మంత్రివర్గం నేడు మరోసారి సమావేశం కానుంది. గురువారం మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో సిఎం రేవంత్ అధ్యక్షతన ఈ భేటీ జరుగనుంది. బిసి రిజర్వేషన్ల విషయంలో హైకోర్టు, సుప్రీంకోర్టు ఆదేశాలపై అధికారుల కమిటీ నివేదికపై మంత్రివర్గం చర్చించనుంది. అలాగే ప్రభుత్వం తీసుకోవాల్సిన తదుపరి చర్యలపై కూడా ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. ఇదే జరిగితే స్థానిక సంస్థల ఎన్నికలపై నెలకొన్న గందరగోళానికి తెరపడనుంది. పాత పద్ధతిలోనే ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో ఊహాగానాలు వినిపిస్తుండగా మంత్రివర్గ సమావేశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కాళేశ్వరం ప్రాజెక్టు, ఎస్ఎల్బిసి పునరుద్ధరణ, ఎస్ఆర్ఎస్పి రెండో దశ పనులపై కూడా ఈ భేటీలో చర్చ జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. అలాగే రైతు భరోసా స్కీమ్కు సంబంధించి కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టుగా సమాచారం. ఈనెల 16వ తేదీన కేబినెట్ సమావేశం కాగా, నేడు మరోసారి కేబినెట్ భేటీ జరుగనుంది.