ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా ఆతిథ్య జట్టుతో జరిగిన తొలి వన్డేలో టీం ఇండియా స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు ఘోరంగా విఫలమయ్యారు. దాదాపు ఏడు నెలల తర్వాత భారత జట్టు తరఫున ఆడిన ఇరువురు అత్యంత చెత్త ప్రదర్శన చేశారు. రోహిత్ 8 పరుగులు చేసి ఔట్ కాగా, విరాట్ ఏకంగా డకౌట్ అయ్యాడు. దీంతో వీరిద్దరి ప్రదర్శనపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. తాజాగా ఈ విషయంపై టీం ఇండియా బ్యాటింగ్ కోచ్ సితాన్షు కొటక్ స్పందించారు. రో-కోల వైఫల్యానికి వాతావరణమే కారణం అని ఆయన అన్నారు.
వాళ్లిద్దరు ఒక్క మ్యాచ్లో రాణించకపోతే ఆందోళన అవసరం లేదని సితాన్షు పేర్కొన్నారు. ‘‘తొలి వన్డేకు వర్షం పలుమార్లు ఆటంకం కలిగించింది. దాని వల్ల ఏకాగ్రత కోల్పోయే అవకాశం ఉంది. ఒకవేళ ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ చేసినా.. వాళ్ల టాపార్డర్ కూడా ఇలాగే కుప్పకూలిపోయేది. రోహిత్-కోహ్లీలు ఆటకు దూరం అయ్యారని అనుకోవడం లేదు. వాళ్లిద్దరూ ఐపిఎల్లో ఆడారు. ఇప్పుడు ఈ సిరీస్ కోసం అత్యుత్తమంగా సన్నద్ధమయ్యారు. సీనియర్లుగా వాళ్ల గొప్ప అనుభవం ఉంది. ఇప్పుడు ఒక్క మ్యాచ్లో సరిగ్గా ఆడనంత మాత్రాన జడ్జ్ చేయాల్సిన అవసరం లేదు. తప్పకుండా రెండో వన్డేలో అదరగొట్టేస్తారని భావిస్తున్నా’’ అని సితాన్షు వెల్లడించారు.