హైదరాబాద్: రాజకీయ లబ్ది కోసం ప్రభుత్వ ఆస్పత్రులపై బిఆర్ఎస్ నాయకులు బురదజల్లుతున్నారని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నర్సింహ మండిపడ్డారు. ప్రజలే ప్రతిపక్షాలకు మరోసారి గుణపాఠం చెబుతారని, బస్తీ దవాఖాన్ల ద్వారా ప్రతి రోజూ సుమారు 45 వేల మంది రోగులకు వైద్య సేవలు అందిస్తున్నామని, అన్ని రకాల మెడిసిన్ బస్తీ దవాఖాన్లలో అందుబాటులో ఉన్నాయన్నారు. బిఆర్ఎస్ నాయకులు బస్తీ దవాఖానల సందర్శనపై రాజ నర్సింహ తన సోషల్ మీడియా ఖాతాలో స్పందించారు. డయాగ్నస్టిక్స్ హబ్స్ ద్వారా బస్తీ దవాఖాన్లకు వచ్చే రోగులకు 134 రకాల టెస్టులు చేయిస్తున్నామని, 24 గంటల లోపల టెస్ట్ రిపోర్టులు రోగులకు అందజేస్తున్నామన్నారు.
బస్తీ దవాఖాన్లలో మెరుగైన వైద్య సేవలు అందుతుండడంతో, గాంధీ, ఉస్మానియా హాస్పిటళ్లపై రోగుల సంఖ్య తగ్గిందని, పేదలకు వైద్య సేవలు అందించే ప్రభుత్వ హాస్పిటళ్లపై కొంతమంది బురద జల్లుతున్నారని, రాజకీయ లబ్ది కోసం ప్రజాప్రతినిధులే తప్పుడు ప్రచారం ద్వారా ప్రభుత్వ హాస్పిటళ్లపై నమ్మకం సన్నగిల్లేలా చేయడం దురదృష్టకరమని మండిపడ్డారు. ప్రైవేటు హాస్పిటళ్లకు లబ్ది చేకూర్చే విధంగా ప్రతిపక్షాలు వ్యవహరిస్తున్న తీరును ప్రజలు గమనిస్తున్నారని, సరియైన సమయంలో మరోసారి వారికి ప్రజలే గుణపాఠం చెబుతారన్నారు. ఇలాంటి కుట్రపూరిత చర్యలు డాక్టర్లు, సిబ్బంది మనోధైర్యాన్ని దెబ్బతీయలేవని, బస్తీ దవాఖాన్లలో ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించే దిశగా మా ప్రయత్నం చేస్తున్నామని దామోదర పేర్కొన్నారు..