హైదరాబాద్: మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో తుర్కపల్లిలో దారుణం చోటుచేసుకుంది. మద్యం మత్తులో గొడవపడి తండ్రిని కన్న కొడుకు హత్య చేశాడు. స్థానికుల వివరాల ప్రకారం… సిద్దిపేట జిల్లా ములుగు మండలం అచయిపల్లి గ్రామానికి చెందిన నిజాముద్దీన్ తన కుటుంబంతో కలిసి మేడ్చల్ జిల్లాలోని తుర్కపల్లిలో నివసిస్తున్నారు. నిజాముద్దీన్ కుమారుడు షేక్ సాతక్ మద్యానికి బానిసగా మారాడు. అతడు తన స్నేహితుడు రాజుతో కలిసి ప్రజయ్ వాటర్ ప్లాంట్ వద్ద మంగళవారం రాత్రి మద్యం సేవించారు. అనంతరం ఇంటికి వచ్చిన తరువాత మద్యం మత్తులో తండ్రితో కొడుకు గొడవకు దిగాడు. దీంతో కుమారుడు షేక్ సాతక్ బండ రాయితో తండ్రిని దారుణంగా కొట్టి హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని మలక చెరువులో పడేశాడు. స్థానికులు సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కుమారుడితో పాటు స్నేహితుడు రాజును అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.