మావోయిస్టు కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ పేరుతో మరో లేఖ విడుదలైంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్ల ప్రయోజనాల కోసం ‘ఆపరేషన్ కగార్’ పేరుతో యుద్ధం చేస్తున్నాయని, మావోయిస్టులను హత్య చేస్తున్నాయని ఆ లేఖలో విమర్శించారు. ప్రభుత్వ చర్యలకు నిరసనగా ఈ నెల 23 వరకు దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని, 24వ తేదీన తలపెట్టిన దేశవ్యాప్త బంద్ను విజయవంతం చేయాలని ప్రజలకు పిలుపునచ్చారు. ఆపరేషన్ కగార్ను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా ప్రజా ఉద్యమాలు నిర్మించాలని సదరు లేఖలో విజ్ఞప్తి చేశారు.
మల్లోజుల, ఆశన్నలను కఠినంగా శిక్షించి తీరుతాం
తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ పేరిట ఓ లేఖ
ఇటీవల జనజీవన స్రవంతిలో కలిసిన మాజీ మావోయిస్టు నేతలు మల్లోజుల వేణుగోపాల్, ఆశన్నలకు మావోయిస్టు పార్టీ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. వారిని క్షమించేది లేదు, కఠినంగా శిక్షించి తీరుతామని స్పష్టం చేసింది. ఈ మేరకు మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ పేరిట ఓ లేఖ విడుదలైంది. పార్టీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వేణుగోపాల్, ఆశన్నలు తీవ్రమైన నమ్మక ద్రోహానికి పాల్పడ్డారని ఆ లేఖలో ఆరోపించారు. ‘విప్లవోద్యమానికి ద్రోహం చేసిన మల్లోజులు, ఆశన్నలకు అమరుల సాక్షిగా శిక్ష తప్పదని శపథం చేస్తున్నాం. వారి చర్యలను పార్టీ త్రీవంగా పరిగణిస్తోంది’ అని సదరు లేఖలో పేర్కొన్నారు. ఈ కుట్ర ‘ఆపరేషన్ కగార్’తో మొదలైందని ఆరోపించారు.