ఫైనాన్స్ వేధింపులు ఒక యువకుడి నిండు ప్రాణాలు బలిగొన్నాయి. ఈ విషాద ఘటన సిద్దిపేట అర్బన్ మండలం, ఎల్లుపల్లి గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. మృతుడి బంధువులు, 3 టౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఐరేని మల్లేశం (30) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగించేవాడు. 2023లో నూతనంగా నిర్మించుకున్న ఇంటి అవసర నిమిత్తం సిద్దిపేటకు చెందిన చోళ మండలం ఫైనాన్స్ కంపెనీలో ఏడు లక్షల 12 వేల రూపాయల రుణంగా తీసుకున్నాడు. ఇందుకు సంబంధించి గత కొంతకాలంగా ఇఎంఐలు చెల్లిస్తూ వస్తున్నాడు. ఈ మధ్యకాలంలో రెండు ఇఎంఐలు పెండింగ్ కావడంతో గత 5 రోజుల నుండి ఫైనాన్స్ నిర్వాహకులు అతనికి ఫోన్ చేయడం, ఇంటికి వస్తుండడం, ఎక్కడైనా పనికి వెళ్తే అక్కడికి వెళ్లి వేధించేవారు. ఆర్థిక పరిస్థితులు సరిగా లేవు..కొంత ఇబ్బంది ఉంది.. డబ్బులు రాగానే చెల్లిస్తాం.. అని చెప్పినప్పటికీ వినకుండా ఈ నెల 16వ తేదీసాయంత్రం ఫైనాన్స్ సంస్థకు చెందిన ఇద్దరు వ్యక్తులు ఎల్లుపల్లి గ్రామానికి వచ్చి ఇంటి వద్ద కూర్చొని ‘డబ్బులు ఇస్తేనే వెళ్తాం.. లేదంటే నువ్వు చచ్చినా వెళ్లం’ అని భీష్మించుకుని కూర్చున్నారు. దీంతో మనస్తాపం చెందిన ఐరేని మల్లేశం ఇంటి నుండి వెళ్లిపోయి తమ వ్యవసాయ బావి శివారులో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. గతంలో మిస్టర్ టి అనే పేరుతో టీ స్టాల్ పెట్టి కొంత ఆర్థికంగా ఇబ్బంది కావడంతో ఫైనాన్స్ కట్టడం ఆలస్యమైందని, ఎంత చెబుతున్నా వినకుండా ఫైనాన్స్ వారు అనేక రకాలుగా మానసికంగా హింస పెట్టడం వలన మనస్తాపంతో తన కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడి తండ్రి దుర్గయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫైనాన్స్ కంపెనీపై కూడా సంబంధిత శాఖకు ఫిర్యాదు చేసినట్లు బంధువులు తెలిపారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు త్రీ టౌన్ పోలీసులు తెలిపారు. ఫైనాన్స్ వేధింపులకు మరికొందరు బలికాకుండా ఎటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని మృతుడి బంధువులు కోరారు.