తెలంగాణలో బీసీలకు న్యాయం చేయాలంటే కేంద్రం బీసీ బిల్లును ఆమోదించాలని పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డా.దనసరి సీతక్క డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్ల కోసం తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని అన్నారు. అందుకే ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేసి, కులగణన ప్రక్రియను ఎక్కడా లోపం లేకుండా పూర్తి చేశామని చెప్పారు. బీసీ రిజర్వేషన్ల పెంపు కోరుతూ అసెంబ్లీలో బిల్లును ఆమోదించామని, అయితే ఆ బిల్లు ఆరు నెలలుగా కేంద్రం వద్ద పెండింగ్లో ఉందని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న తెలంగాణ బంద్ను ప్రజాభవన్లోని మంత్రి సీతక్క నివాసంలో మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, స్పోర్ట్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి శనివారం పర్యవేక్షించారు. అనంతరం ట్యాంక్బండ్ అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకున్న మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, రాజ్యసభ సభ్యుడు అనిల్కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, స్పోర్ట్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి, ఇతర నేతలతో కలిసి బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం నిర్వహించిన ప్రదర్శనలో పాల్గొన్నారు.
రాజ్యాంగ నిర్మాత డా.బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన నేతలు జై బీసీ, బీసీల ఐక్యత వర్ధిల్లాలి, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాధిద్దాం అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు కేంద్రంపై ఒత్తిడి తెచ్చే ఉద్దేశ్యంతో బీసీ బంద్ నిర్వహించామని తెలిపారు. ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని బంద్ను విజయవంతం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలిపారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం బీసీలకు న్యాయం చేయకుండా బిల్లును నిలిపి వేస్తోందని ఆమె విమర్శించారు. బిజెపి పార్టీ రెండు నాలుకల ధోరణితో వ్యవహరించడం దారుణమని అన్నారు. తెలంగాణలోని బిజెపి నేతలు బీసీ రిజర్వేషన్లకు మద్దతిస్తామంటారు, కానీ ఢిల్లీలో వారి పెద్దలు ‘నో’ అంటారని తెలిపారు. బీసీ అని చెప్పుకునే ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ బీసీ బిల్లుకు వెంటనే ఆమోదం తెలపాలని సీతక్క డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్ల పెంపు విషయంలో బిజెపి, బిఆర్ఎస్ నేతలకు మాట్లాడే నైతిక హక్కు లేదని అన్నారు. కులగణనలో పాల్గొనని వారు బీసీల హక్కులపై మాట్లాడడం హాస్యాస్పదమన్నారు. వారికి ప్రజలే సమాధానం చెబుతారని మంత్రి సీతక్క స్పష్టం చేశారు.
……………..