హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో అన్ని రాజకీయ పార్టీలు బిసిల బిల్లుకు మద్దతు తెలపడంతో పాటు పాస్ చేసుకోవడం జరిగిందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. నిర్ణయం తీసుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వం మౌనంగా ఉండడంతో తదుపరి చర్యలు తీసుకోపోవడంతో బిసి బిల్లు అమలులో జాప్యం జరుగుతుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వడానికి రాష్ట్ర వ్యాప్తంగా కుల సర్వే నిర్వహించామని, శాసన సభలో చట్టం చేసి గవర్నర్ దగ్గర ఆమోదం పొందలేదని, రాష్ట్రపతి దగ్గర పెండింగ్ లో ఉందన్నారు. న్యాయ స్థానాల్లో పోరాటాలు చేస్తున్నామని, హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేస్తున్నామన్నారు. తెలంగాణ బలహీన వర్గాలు జాయింట్ యాక్షన్ కమిటీ గా ఏర్పడి మాదిగ దండోరా, మాల మహానాడు, బిసి సంఘాలు ఐక్య సమితిగా బంద్ కి పిలునిచ్చినందుకు వారికి పొన్నం ధన్యవాదాలు తెలిపారు. బిసి రిజర్వేషన్ల కోసం తెలంగా బంద్ ప్రశాంతంగా జరుగుతుందన్నారు. రవాణా శాఖ మంత్రిగా అన్ని రాజకీయ పార్టీల విజ్ఞప్తి మేరకు బస్సులు కూడా బంద్ చేసుకోవడం జరిగిందని పొన్నం వివరించారు.
ప్రజలకు అసౌకర్యం అయినప్పటికీ బంద్ ప్రభావం ప్రభుత్వాలపై పడడంలేదని, ముఖ్యంగా కేంద్రమంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డిలు, బిజెపి ఎంపిలంత తెలంగాణ బలహీన వర్గాల ప్రజల ఆకాంక్షలు కేంద్రానికి చెప్పే ప్రయత్నాలు చేయాలని పొన్నం డిమాండ్ చేశారు. రిజర్వేషన్లు అమలు చేస్తున్న తొలి రాష్ట్రంగా బలహీన వర్గాలకు న్యాయం చేసిన రాష్ట్రంగా బిజెపి నాయకత్వంలో ఇచ్చే ప్రయత్నం చేయాలని సూచించారు. తెలంగాణ ప్రజల ముందు దోషిగా నిలబడే పరిస్థితి వస్తుందన్నారు. రాష్ట్రంలో బిసి బిల్లు కోసం కాంగ్రెస్ బాధ్యత నిర్వహించిందని, కేంద్రంలో బిజెపిపై ఉందన్నారు. నిర్ణయం తీసుకోవాల్సిన కేంద్రం ఎలాంటి జాప్యం లేకుండా వెంటనే నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఏ న్యాయ స్థానంలో అయినా తాము వాదనలు వినిపించడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేశారు. బిసి రిజర్వేషన్ల బంద్ లో పాల్గొన్న ప్రజలకు పొన్నం అభినందనలు తెలిపారు. 42 శాతం రిజర్వేషన్లు సాధించడానికి తెలంగాణ ఉద్యమం స్ఫూర్తితో మన పోరాటం కొనసాగాలన్నారు. 42 శాతం రిజర్వేషన్లు సాధించడానికి జెఎసి పోరాటాలు కొనసాగిస్తుందని పేర్కొన్నారు. గత రెండు సంవత్సరాల నుండి కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రామ పంచాయతీలకు నిధులు రాక ఇబ్బందులు పడుతున్నారని పొన్నం మండిపడ్డారు.