మన తెలంగాణ/హైదరాబాద్: జూబ్లీహిల్స్లో జరుగుతున్న ఎన్నిక పార్టీల మధ్యలో జరుగుతున్న ఎన్నిక కాదని, ఈ ఉప ఎన్నిక ఇద్దరు వ్యక్తుల ఎన్నిక కాదని బిఆర్స్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. పదేళ్ల అభివృద్ధి, పాలనకి, రెండు సంవత్సరాల అరాచక పాలనకి మధ్య జరుగుతున్న ఎన్నిక అని స్పష్టం చేశారు. బుధవారం జూబ్లీహిల్స్ నియోజకవర్గం అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ నామినేషన్ కోసం బయలుదేరేముందు భారత రాష్ట్ర సమితి కార్యాలయం తెలంగాణ భవన్లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియాతో మా ట్లాడారు. జూబ్లీహిల్స్లో ఆడబిడ్డ గెలుపు కోసం రాష్ట్రంలోని కోటి 67లక్షల మంది ఆడబిడ్డలు ఎదురుచూస్తున్నారని, ఈ మె గెలుపుతోనైనా ప్రభుత్వం ఆడబిడ్డలకు ఇచ్చిన హామీ మేరకు నెలకు రూ.2500 ఇస్తుందని ఆశిస్తున్నానని అన్నారు. లక్షల మంది రైతన్నలు ఈమె గెలుస్తుందని ఆశిస్తున్నారని,
ఆ తర్వాతే తమకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ అమలు చేస్తుందని చెప్పారు. రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి, తర్వాత మోసపోయిన యువతి యువకులు చూస్తున్నారని, తమ ఇళ్లు కూలగొట్టిన అరాచకాలను చూసిన తరువాత ఈ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి గెలవాలని, ఆ అరాచకాలు ఆగాలని హైదరాబాద్ నగర పేదలు చూస్తున్నారని స్పష్టం చేశారు. మూతపడుతున్న బస్తీ దవాఖానాలు, ఉచిత తాగునీరు ఆగిపోతున్న విషయాలు ప్రజలందరూ చూస్తున్నారని, కాంగ్రెస్ పార్టీ ఒక ఇల్లు కూడా హైదరాబాదులో కట్టలేదని అన్నారు. కేసీఆర్ హైదరాబాద్లో కట్టిన లక్ష ఇళ్లు, ఇచ్చిన ఇళ్ల పట్టాలు, ఇతర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అన్నీ కూడా హైదరాబాద్ నగర ప్రజలకు గుర్తున్నాయని, కాంగ్రెస్ చేతిలో మోసపోయిన మైనార్టీలకు ఈ ఎన్నిక ఒక అవకాశంగా భావిస్తున్నారని పేర్కొన్నారు.
గుణపాఠం చెప్పడానికి బీసీలు సిద్ధం
ప్రభుత్వంలో ఒక్క మైనారిటీకి కూడా అవకాశం ఇవ్వకుండా దారుణంగా వారిని అవమానపరిచిన మైనారిటీలు, ఈ ఎన్నికను రాష్ట్ర ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పడానికి ఒక అవకాశంగా భావిస్తున్నారని చెప్పారు. తమకు ఇచ్చిన బీసీ డిక్లరేషన్, రిజర్వేషన్లు అన్నీ మోసమని, ఈ అంశంలో గుణపాఠం చెప్పడానికి రాష్ట్రవ్యాప్తంగా బీసీలు సిద్ధంగా ఉన్నారన్నారు. దళిత బంధు, అభయహస్తం అని చెప్పి మోసం చేసిన దళితులు కూడా ఆగ్రహంతో ఉన్నారని, తమ అభ్యర్థికి అన్ని వర్గాల నుంచి మద్దతు వెల్లువెత్తుతున్నదన్నారు. కేసీఆర్ ఆధ్వర్యంలో మరోసారి పాలన రావడానికి, హైదరాబాద్ నగరంలో జరుగుతున్న ఈ ఉప ఎన్నిక పునాది కాబోతున్నదని, మరోసారి రాష్ట్రంలో గులాబీ పార్టీ జైత్రయాత్ర జూబ్లీహిల్స్ నుంచే ప్రారంభం కాబోతున్నదని వెల్లడించారు.
తమ పార్టీ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలి
అన్ని వర్గాల మద్దతు, అండతో తమ పార్టీ అభ్యర్థి సునీత ఘన విజయం సాధించబోతున్నదని, రెండు సంవత్సరాల ఈ విఫల కాంగ్రెస్ ప్రభుత్వానికి, పార్టీకి బుద్ధి చెప్పడానికి ప్రతి ఒక్కరూ తమ పార్టీ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. జూబ్లీహిల్స్లో ప్రతి ఒక్కరికి, నియోజకవర్గానికి విశేషమైన సేవలు అందించిన నాయకుడు గోపీనాథ్ అని, హైదరాబాద్ నగరంలో అన్ని నియోజక వర్గాల్లో మా పార్టీ గెలుపొందిందంటే అప్పటి జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన గోపీనాథ్ కృషి కూడా ఉందన్నారు. గోపీనాథ్ అకాల మరణంతో బాధపడుతున్న కుటుంబాన్ని అందరూ ఆదుకోవాలని పార్టీ అధ్యక్షులు కేసీఆర్ నిర్ణయించి, ఆయన సతీమణి సునీత గోపీనాథ్కి టికెట్ కేటాయించడం జరిగిందన్నారు. సునీతకి సహాయం కోసం పార్టీ కీలక నాయకులంతా పనిచేయాలని కేసీఆర్ ఆదేశించారని, అందరి ఆశీర్వాదాలతో సునీత ఎన్నికల్లో గెలవబోతున్నారని కెటిఆర్ పునరుద్ఘాటించారు.