ఈ ఏడాది ప్రతిష్ఠాత్మకమైన నోబెల్ శాంతి బహుమతి వెనెజువెలా ప్రతిపక్ష నాయకురాలు మరియా కొరినా మచాదో దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ ఎంపికపై భగ్గుమన్న వెనెజువెలా ప్రభుత్వం ప్రతీకార చర్యలు చేపట్టింది. అందులో భాగంగా నార్వే లోని తమ దౌత్య కార్యాలయాన్ని మూసివేస్తున్నట్టు ప్రకటించింది. ఈమేరకు వెనెజువెలా విదేశాంగ మంత్రిత్వశాఖ సోషల్ మీడియా పోస్టులో వెల్లడించింది. తమ దౌత్య కార్యకలాపాల అంతర్గత పునర్వవస్థీకరణలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. మరోవైపు జింబాబ్వే, బుర్కినా ఫాసో వంటి దేశాల్లో తమ ప్రాతినిధ్యం పెంచుకునేందుకు గాను ఆస్ట్రేలియా లోని తమ రాయబార కార్యాలయాన్ని మూసివేస్తున్నట్టు పేర్కొంది. వెనెజువెలా ప్రభుత్వం నిర్ణయంపై నార్వే విదేశాంగ మంత్రిత్వశాఖ అసంతృప్తి వ్యక్తం చేసింది.
అనేక విషయాల్లో తమ విభేదాలు ఉన్నప్పటికీ వెనెజువెలాతో తాము చర్చలు కోరుకుంటున్నామని తెలిపింది. ఆ దిశగా పనిచేస్తుందని వివరించింది. ఈ సందర్భంగా నోబెల్ బహుమతి ప్రకటించడం అనేది నార్వే ప్రభుత్వానికి చెందిన స్వతంత్ర నిర్ణయమని స్పష్టం చేసింది. వెనెజువెలా ప్రతిపక్ష నాయకురాలు మచాదో , దేశ ప్రజల హక్కుల కోసం అవిశ్రాంత పోరాటం చేసినందుకు ఆమెకు ఈ పురస్కారం ఇస్తున్నట్టు నార్వే నోబెల్ కమిటీ పేర్కొంది. వెనెజువెలాకు ప్రస్తుతం నికోలస్ మదురో అధ్యక్షుడిగా ఉన్నారు. అయితే మదురో ఎన్నికను యూఎస్తో సహా పలు దేశాలు గుర్తించలేదు. మచాదోకు నోబెల్ ప్రకటించడంపై అక్కడి ప్రభుత్వం ఇప్పటివరకు స్పందించలేదు. ఈ క్రమం లోనే దౌత్య కార్యాలయం మూసివేయడం గమనార్హం. ఇక తనకు దక్కిన ఈ అవార్డును అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు అంకితమిస్తున్నట్టు మచాదో పేర్కొన్నారు.