హైదరాబాద్: వేల ఎకరాలను నల్గొండ ప్రజల కోసం దామన్న త్యాగం చేశారని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీని దామన్న నిలబెట్టారని అన్నారు. సూర్యా పేట జిల్లా తుంగతుర్తిలో రాంరెడ్డి దామోదర్ రెడ్డి సంస్మరణ కార్యక్రమం జరిగింది. మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి సంతాపసభలో సిఎం రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రఘువీర్ రెడ్డి ఎమ్మెల్సిలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. దామోదర్ రెడ్డి చిత్రపటానికి సిఎం పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిఎం మీడియాతో మాట్లాడుతూ.. గోదావరి జలాలను నల్గొండకు తేవడానికిదామన్న కృషి చేశారని, ఆనాటి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టును తీసుకొచ్చారని తెలియజేశారు.
ఎమ్మెల్యేగా గెలవకపోయినా తుంగతుర్తి ప్రజలకోసం పనిచేశారని, తుంగతుర్తిలో కాంగ్రెస్ గెలిచింది అంటే రాంరెడ్డి దామోదర్ రెడ్డి వల్లే అని రేవంత్ కొనియాడారు. రాంరెడ్డి దామోదర్ రెడ్డి కుటుంబానికి కాంగ్రెస్ అధిష్టానం అండగా ఉంటుందని సోనియా గాంధీ చెప్పారని అన్నారు. రాంరెడ్డి దామోదర్ రెడ్డి కుటుంబానికి రాజకీయంగా అవకాశం ఇస్తామని, రాంరెడ్డి దామోదర్ రెడ్డికి అండగా ఉంటామని ఎఐసిసి అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, సోనియా గాంధీ హామీ ఇచ్చారని పేర్కొన్నారు. నల్గొండలో గోదావరి నీళ్లు ప్రవహిస్తున్నాయంటే దామన్న వల్లేనని, ఎస్ఆర్ఎస్పి కి రాంరెడ్డి దామెదర్ రెడ్డి పేరు పెడతామని ఎస్ఆర్ఎస్పి-2 కి ఆర్ డిఆర్ అని నామకరణం చేస్తామని అన్నారు. ఎస్ఆర్ఎస్పి పేరు ఆర్ డిఆర్ఎస్పి ప్రాజెక్టుగా మారుస్తూ జివో ఇస్తామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.