హైదరాబాద్: పాలనలో పారదర్శకతను తీసుకురావడమే సమాచారహక్కు చట్టం ముఖ్య లక్ష్యం అని టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. దూరదృష్టితో యూపిఎ ప్రభుత్వం సమాచార హక్కు చట్టం తీసుకొచ్చిందని అన్నారు. ఈ సందర్భంగా గాంధీభవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పాలనలో ఎవరైనా తప్పు చేస్తే సామాన్యుడు ప్రశ్నించేలా ఆర్టిఐ చట్టం తీసుకొచ్చామని, గొప్ప చట్టాలను తీసుకొచ్చి ప్రజలకు సంపూర్ణమైన హక్కులను యూపిఎ ప్రభుత్వం కల్పించిందని తెలియజేశారు. కాంగ్రెస్ తీసుకొచ్చిన గొప్ప చట్టాలను ఎన్డియే ప్రభుత్వం తూట్లు పొడిచిందని మండిపడ్డారు. ఆర్టిఐ చట్టానికి సవరణలు చేసి.. దాని స్వతంత్రతను బలహీనపరిచారని అన్నారు. ఆర్టిఐ కమిషనర్ పదవీకాలం, జీతభత్యాలను కేంద్రమే నిర్ణయించేలా సవరణలు చేశారని, వాస్తవాలను బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే.. ప్రాణాలు తీస్తామని బెదిరించారని ఆవేదనను వ్యక్తం చేశారు. ఆర్టిఐని నీరుగార్చేందుకు కమిషనర్ పోస్టులను భర్తీ చేయట్లేదని, కేంద్రంలో 11 మంది ఆర్టిఐ కమిషనర్లు ఉండాల్సిన చోట ఇద్దరే ఉన్నారని మహేష్ గౌడ్ పేర్కొన్నారు.