జోర్డాన్లో చిక్కుకున్న గల్ఫ్ కార్మికులుకు హరీష్ రావు భరోసా
మనతెలంగాణ/హైదరాబాద్ : ఉపాధి కోసం వెళ్లి జోర్డాన్లో చిక్కుకున్న 12 మంది తెలంగాణ వలస కార్మికులకు మాజీ మంత్రి, బిఆర్ఎస్ ఎంఎల్ఎ హరీష్ రావు భరోసా ఇచ్చారు. వారి సమస్యలను విదేశీ వ్యవహారాల శాఖ దృష్టికి తీసుకెళ్లామని.. వారిని తెలంగాణకు రప్పించేందుకు అన్ని విధాల కృషి చేస్తున్నామని తెలిపారు.
ఉపాధి కోసం తెలంగాణ నుంచి వెళ్లి జోర్డాన్లో చిక్కుకున్న గల్ఫ్ కార్మికులతో హరీష్రావు ఫోన్లో మాట్లాడారు. మీరు ఇబ్బంది పడుతున్నారనే విషయం మా దృష్టికి వచ్చిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ దృష్టికి తీసుకెళ్లామని జోర్దాన్లో చిక్కుకుపోయిన వారికి హరీష్ రావు వివరించారు. ఎలాగైనా మిమ్మల్ని తెలంగాణకు తీసుకువచ్చే కృషి చేస్తున్నామని, అధైర్య పడవద్దని ధైర్యం చెప్పారు. బిఆర్ఎస్ పార్టీ పార్లమెంటరీ నాయకులు, రాజ్యసభ ఎంపీ సురేష్ రెడ్డి విదేశీ వ్యవహారాల శాఖ అధికారులతో మాట్లాడుతున్నారని తెలిపారు. ఏడాది క్రితం ఉపాధి కోసం వెళ్లిన 12 మంది తెలంగాణ వలస కార్మికులు జోర్డాన్లో చిక్కుకున్నారు. దేశం కాని దేశంలో నిర్మల్, కామారెడ్డి, నిజామాబాద్, జగిత్యాల, సిద్దిపేటకు చెందిన గల్ఫ్ కార్మికులు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. అక్కడే ఉండి బతికేందుకు చేతిలో డబ్బులు లేక, కంపెనీ అనుమతి ఇవ్వకపోవడంతో తిరిగి స్వదేశానికి రాలేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కార్మికులు హరీశ్ రావుకు గోడు వెళ్లబోసుకున్నారు. ఎలాగైనా తమను తెలంగాణలో ఉన్న కుటుంబ సభ్యుల వద్దకు చేర్చాలని వేడుకున్నారు. ఈ క్రమంలో హరీశ్ రావు ఫోన్ చేసి వారితో మాట్లాడి ధైర్యం చెప్పారు.