మన తెలంగాణ/హైదరాబాద్:ప్రజా ప్రభుత్వం లో చేనేత కార్మికులకు మహర్దశ పట్టనుందని చే నేత జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. శుక్రవారం సచివాలయంలో చేనేత జౌళి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ తో పాటు జౌళి టెస్కో ఉన్నతాధికారులతో మం త్రి తుమ్మల సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 64 లక్షల 69 వేల192 మహిళా శక్తి చీరల పంపిణీ కోసం 4 కోట్ల 34 లక్షల మీటర్ల క్లాత్ అవసరం ఉండగా ఇప్పటి వరకు 3 కోట్ల 65 లక్షల మీటర్ల క్లాత్ పవర్ లూమ్ కార్మికులు ఉత్పత్తి చేశారని తెలిపారు. ఇప్పటి వరకు 33. 35 లక్షల చీరలు జిల్లా స్థాయి గోడౌన్స్ కు టె స్కో ఆధ్వర్యంలో సరఫరా చేసినట్లు మంత్రి వెల్లడించారు. ఇందిరా మహిళా శక్తి చీరలు ఉత్పత్తి కోసం 6,900 మంది నేత కార్మికులకు ఆరు నుంచి ఎనిమిది నెలల వరకు ఉపాధి కలుగగా తద్వారా నేత కార్మికులకు ప్రతి నెల 18 నుంచి 22 వేల వేతనం పొందుతున్నారన్నారు. ఇం దిరా మహిళా శక్తి చీరలు ఉత్పత్తి సరఫరా నవంబర్ 15 నాటికి పూర్తి చేసి జిల్లా గోడౌన్స్ కు తరలించి పంపిణికి సిద్ధం చేయాలని మంత్రి సూ చించారు.
చేనేత కార్మికులు రుణమాఫీ అంశంపై ప్రక్రియ వేగవంతం చేయాలని అధికారులకు మంత్రి దిశా నిర్దేశం చేశారు. సాధ్యమయినంత త్వరలో వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి చేసి వారి అకౌంట్స్ లో డబ్బులు జమ చేయాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు. చేనేత కార్మికులకు లక్ష వరకు వ్యక్తిగత రుణమాఫీతో 6,780 మంది రుణ విముక్తులు కానున్నారని మంత్రి చెప్పారు. తెలంగాణ చేనేత బ్రాండ్ కొరకు గతంలోనే తెలంగాణ చేనేత లేబుల్ ఆవిష్కరించడం జరిగిందని, ఈ చేనేత లేబుల్ ద్వారా నాణ్యమైన చేనేత ఉత్పత్తులు వినియోగ దారులకు అందుబాటులోకి వస్తాయని మంత్రి వివరించారు. తెలంగాణ నేతన్న భరోసా పథకంలో భాగంగా చేనేత కార్మికులకు ప్రోత్సాహం ఇవ్వడం కోసం ఈ ఏడాది రూ. 48.80 కోట్లు కేటాయించామని తెలిపారు.ఈ పథకంలో భాగంగా చేనేత ఉత్పత్తులు చేసిన చేనేత కార్మికులకు ఒక్కొక్కరికి 18 వేలు, అనుబంధ కార్మికులకు 6 వేలు ప్రోత్సాహకం కింద అందించడం జరుగుతుందని, ఈ పథకంలో ఏడాదిలో రెండు విడతలుగా ప్రోత్సాహం ఇవ్వడం జరుగుతుందని మంత్రి పేర్కొన్నారు.
చేనేత కార్మికులకు మేలు చేసేలా నిబంధనలు సరళీకృతం చేసి అమలు అయ్యేలా చూడాలని అధికారులకు మంత్రి తుమ్మల సూచించారు. తెలంగాణ నేతన్న భరోసా పథకం కింద ఇప్పటి వరకు 13,371 మంది నమోదు చేసుకోగా ఇంకా 3,966 దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయని, ఈ పథకంలో 18 వేల చేనేత కార్మికులు లబ్ది పొందనున్నారని మంత్రి వెల్లడించారు. వచ్చే సంవత్సరానికి సంబంధించి అన్ని ప్రభుత్వ శాఖలు, కార్పొరేషన్ల సంస్థల నుంచి వస్త్ర కొనుగోలుకు వంద శాతం ఆర్డర్స్ టెస్కో ద్వారా తీసుకుని చేనేత, పవర్ లూమ్ సంఘాలకు వర్క్ ఆర్డర్ ఇచ్చి నిరంతరం పని కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. గతంలో వివిధ ప్రభుత్వ శాఖలకు సరఫరా చేసిన వస్త్రాలకు సంబంధించి పెండింగ్ బిల్లులు టెస్కో కు చెల్లించేటట్లు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రస్తుతం హైదరాబాద్ లో తాత్కాలికంగా నడుపుతున్న ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్ లూమ్ టెక్నాలజిని యాద్రాద్రి భువనగిరి జిల్లాలోని పోచంపల్లి హ్యాండ్ లూమ్ పార్క్ లోకి మార్చాలని సత్వరమే పనులు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు.