ప్రియదర్శి, నిహారిక ఎన్ఎం హీరో హీరోయిన్లుగా విజయేందర్ దర్శకత్వంలో బీవీ వర్క్ బ్యానర్ మీద బన్నీ వాస్ సమర్పణలో సప్తాస్వ మీడియా వర్క్ మీద కళ్యాణ్ మంథిన, భాను ప్రతాప, డా. విజేందర్ రెడ్డి తీగల నిర్మించిన చిత్రం ‘మిత్ర మండలి’. ఈ మూవీ అక్టోబర్ 16న రిలీజ్ కాబోతోంది.
ఈ క్రమంలో నిర్మాతలు కళ్యాణ్ మంథిన, భాను ప్రతాప మీడియాతో మాట్లాడుతూ.. “బన్నీ వాసు వల్లే ఈ కథ మాకు వచ్చింది. ఈ స్టోరీ మాకు చాలా నచ్చింది. ఆద్యంతం వినోదాన్ని అందిస్తూనే సెటైరికల్గా ఉంటుంది. విజయేందర్ మంచి దర్శకుడు. అనుదీప్, ‘మ్యాడ్’ కళ్యాణ్, ఆదిత్య హాసన్లతో విజయేందర్ పని చేశాడు. పూర్తి స్క్రిప్ట్తోనే మా వద్దకు వచ్చాడు. కథను ఎంత అద్భుతంగా రాసుకున్నాడో.. అంతే అద్భుతంగా తీశాడు. కొత్త దర్శకుడిలా, మొదటి సినిమాలా అనిపించలేదు. ‘మిత్ర మండలి’లో బ్రహ్మానందం పాత్ర చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ‘జంబర్ గింబర్ లాలా’ పాటను అనుకోకుండా చిత్రీకరించాం. ముందు అసలు ఆ పాటను అనుకోలేదు. కానీ మాకు సినిమా పూర్తయిన తరువాత ఏదో అసంతృప్తిగా అనిపించింది. దీంతో బ్రహ్మానందంతో అలా పాటను చిత్రీకరించాం. ఆయన కూడా ఆ పాటను, లిరిక్స్ను ఎంజాయ్ చేశారు. ఇక ‘జాతి రత్నాలు’ కథకు, మా సినిమా కథకు ఎలాంటి సంబంధం లేదు. ఆ మూవీని ఎంతలా ఎంజాయ్ చేశారో మా చిత్రాన్ని చూసి కూడా అంతే ఎంజాయ్ చేస్తారు. ‘జంగ్లీ పట్టణం’ అనే ఓ ఫిక్షనల్ టౌన్ను డైరెక్టర్ సృష్టించాడు. ఆ ఫిక్షనల్ టౌన్లో జరిగే కథ ఇది. అందులోని ప్రియదర్శి, నిహారిక పాత్రలు అందరినీ ఆకట్టుకుంటాయి. ఈ చిత్రం ఎక్కువగా యూత్కు నచ్చుతుంది. నిహారిక మాట్లాడితే ఓ సెటైర్ కనిపిస్తుంది. ఇందులో అలాంటి పాత్రే ఉంటుంది. అందుకే ఆమెను తీసుకున్నాం. అల్లు అరవింద్ నిహారికను చూసిన వెంటనే ఓకే చేశారు. ‘మిత్ర మండలి’ కోసం లేని ఓ కులం పేరుని తీసుకు వచ్చాం. అలా చేసిన ఫిక్షనల్ క్యాస్ట్తో సమాజంలో ఉన్న కుల వ్యవస్థ మీద సెటైరికల్గా సీన్లను చిత్రీకరించాం. దీపావళి పండుగ వాతావరణంలో ఎన్ని మంచి చిత్రాలు వచ్చినా జనాలు చూస్తారు. మంచి సినిమాను ఆడియెన్స్ కచ్చితంగా చూస్తారు. ఆ నమ్మకంతోనే మా మూవీని దీపావళి సీజన్లోకి తీసుకు వస్తున్నాం”అని అన్నారు.