వాషింగ్టన్ : నోబెల్ శాంతి బహుమతి అందుకోవాలన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కల ఈసారి తీరలేదు. ఈ ఏడాది ప్రతిష్ఠాత్మక నోబెల్ పురస్కారానికి వెనెజువెలా విపక్ష నేత మరియా కొరీనాను ఎంపిక చేసినట్టు శుక్రవారం అకాడమీ ప్రకటించింది. దీనిపై తాజాగా అమెరికా అధ్యక్ష భవనం శ్వేతసౌధం స్పందించింది. ఈ పురస్కార విజేత ఎంపికలో రాజకీయ వివక్ష చూపించారని విమర్శించింది. తాజా పరిణామాలపై వైట్హౌస్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ స్టీవెన్ చుయెంగ్ మాట్లాడారు. “ నోబెల్ కమిటీ మరోసారి శాంతి స్థాపనకంటే రాజకీయాలకే అధిక ప్రాధాన్యం ఇచ్చింది.
ప్రపంచ శాంతి కోసం నిజమైన నిబద్ధత చూపించిన వారిని పక్కనబెట్టి రాజకీయ వివక్షను ప్రదర్శించింది. అయినప్పటికీ అధ్యక్షుడు ట్రంప్ ప్రపంచ వ్యాప్తంగా యుద్ధాలను ఆపేందుకు తన ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉంటారు. శాంతి ఒప్పందాలతో ప్రాణాలు నిలబెడుతారు. ఆయన మానవతావాది .. తన సంకల్ప శక్తి పర్వతాలను కదిలించే ఆయనలాంటి వ్యక్తి మరొకడు ఉండరు ” అని చుయెంగ్ ఎక్స్లో పోస్ట్ చేశారు. అటు ట్రంప్నకు మద్దతిచ్చే మాగా వాయిస్ కూడా తన ఎక్స్ఖాతాలో దీనిపై స్పందించింది. “ నోబెల్ శాంతి బహుమతి ఓ జోక్గా మారింది. తెలివి ఉన్నవారు ఎవరైనా ట్రంప్నకే నోబెల్ రావాల్సింది అని అనుకుంటారు.” అని విమర్శలు గుప్పించింది.