బెంగళూరు : మహిళా ఉద్యోగుల విషయంలో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నెలకు ఒకరోజు వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో నిర్ణయించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగినులతోపాటు వస్త్రపరిశ్రమ , బహుళజాతి సంస్థలు, ఐటీకంపెనీలు, ఇతర ప్రైవేట్ పరిశ్రమల్లో పనిచేసే వారికి ఈ సెలవు వర్తించనుందని ప్రభుత్వం వెల్లడించింది. “ శ్రామిక మహిళల ఆరోగ్యం, శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నాం. నెలసరి ఆరోగ్యంపై అవగాహన కల్పించడంతోపాటు మహిళలకు మానసిక, శారీరక సౌకర్యం అందించాలన్నదే మా ఉద్దేశం. ఈ నిర్ణయం ఉద్యోగినులకు ఎంతగానో ఉపకరించనుంది. ఈ విధానాన్ని ఇతర రాష్ట్రాలు విజయవంతంగా అమలు చేస్తున్నాయి. అందుకే ఇక్కడా ఆ సెలవును ఇవ్వాలనుకున్నాం. ” అని క్యాబినెట్ సమావేశం అనంతరం న్యాయశాఖ మంత్రి హెచ్కే పాటిల్ వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని మహిళా హక్కుల కార్యకర్త బృందా అడిగె స్వాగతించారు. మహిళల భాగస్వామ్యాన్ని పెంచడానికి ఇలాంటి నిర్ణయాలు దోహదం చేస్తాయని హర్షం వ్యక్తం చేశారు. అయితే అసంఘటిత రంగంలో సవాళ్లను పరిష్కరించాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు. ఇప్పటికే బీహార్, ఒడిశా, కేరళ, సిక్కిం రాష్ట్రాలు ఈ నెలసరి సెలవును అమలు చేస్తున్నాయి. అలాగే జొమాటో , స్విగ్గీ, ఎల్ అండ్ టీ, గోజూప్ వంటి సంస్థలు వేతనంతో కూడిన ఈ సెలవును ఇస్తున్నాయి.