మనతెలంగాణ/హైదరాబాద్ : బిసి రిజర్వేషన్లపై కాంగ్రెస్ ప్రభుత్వం డ్రామా చేస్తోందని మాజీ మంత్రి, బిఆర్ఎస్ ఎంఎల్ఎ హరీష్ రావు ఆరోపించారు. ఆరు గ్యారెంటీల లాగే, కాంగ్రెస్ 42 శాతం బిసి రిజర్వేషన్ల డ్రామా అని పేర్కొన్నారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల్లో బిసి రిజర్వేషన్ల అమలు జిఒ నెం.9పై హైకోర్టు స్టే విధించడంపై హరీష్రావు ఎక్స్ వేదికగా స్పందించారు. 55 ఏళ్లు కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్.. ఏనాడైనా బిసి రిజర్వేషన్ల కోసం పాటు పడిందా..? అని ప్రశ్నించారు. చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్ ఢిల్లీ నేతలతో పోరాటం చేయాలని, అందుకు కలిసి రావడానికి బిఆర్ఎస్ సిద్ధం అని పేర్కొన్నారు. మాయ మాటలు చెప్పి గత ఎన్నికల్లో బిసిలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ లబ్ది పొందాలని చేసిన కుట్రలు పటాపంచలయ్యాయని విమర్శించారు. 22 నెలలుగా బిసి రిజర్వేషన్ల కోసం ఢిల్లీలో కొట్లాడాల్సిన రేవంతు రెడ్డి, గల్లీలో కొట్లాడుతున్నట్లు డ్రామా క్రియేట్ చేసారు తప్ప, బిసిలకు 42 శాతం రిజర్వేషన్ సాధించడం పట్ల ఏనాడూ చిత్తశుద్ది ప్రదర్శించలేదని ఆరోపించారు. కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం, 42 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు చట్ట బద్దత కోసం కేంద్రాన్ని పట్టుబట్టాల్సిన రేవంత్ రెడ్డి, తెలివిగా దాన్ని పక్కదోవ పట్టించారని మండిపడ్డారు. బిసిల పట్ల తమకు నిజంగానే ప్రేమ ఉన్నట్లు చాటుకునేందుకు తూతూ మంత్రంగా జిఒ ఇచ్చి కొత్త నాటకానికి తెరతీసి, స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకుండా కాలయాపన చేశారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి ఇప్పటికైనా డ్రామాలు ఆపి, బిసిల పట్ల నిజంగా చిత్తశుద్ది ఉంటే 42 శాతం పెంపు విషయమై ఢిల్లీలో కొట్లాడి, పార్లమెంట్లో చట్టం చేయించి, షెడ్యుల్ 9లో చేర్చాలని డిమాండ్ అన్నారు. బిసిలకు 42శాతం రిజర్వేషన్ పోరాటంలో అఖిల పక్షాలను భాగస్వామ్యం చేయాలని పేర్కొన్నారు. ఢిల్లీ వేదికగా యుద్ద భేరి మోగించండి.. ఉద్యమ పార్టీగా బిఆర్ఎస్ ఎల్లప్పుడూ బిసిల కోసం గొంతెత్తుతుది… ఢిల్లీని నిలదీస్తుందని హరీష్రావు స్పష్టం చేశారు.