ఆర్టీసిని విధ్వంసం చేసిందే బిఆర్ఎస్ ప్రభుత్వమని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ఫైర్ అయ్యారు. మళ్లీ నేడు వారు చార్జీల పెంపు, ఆర్టీసి కార్మికుల కష్టనష్టాలపై మాట్లాడుతుంటే నవ్వొస్తుందని ఆయన అన్నారు. గురువారం ఆద్దంకి విలేకరులతో మాట్లాడుతూ నాడు 40 రోజుల పాటు ఆర్టీసి ఉద్యోగులు సమ్మె చేస్తే పట్టించుకోని బిఆర్ఎస్ నాయకులకు ఆర్టీసి గురించి మాట్లాడే నైతిక హక్కు ఉందా అని అద్దంకి ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సిఎం రేవంత్ రెడ్డి ఆలోచన మేరకు ఆర్టీసిని క్రమంగా ప్రభుత్వ పరం చేయాలని ఆలోచన ఉన్న సమయంలో బిఆర్ఎస్ నేతలు గందరగోళం సృష్టించడం సిగ్గుచేటని ఆయన అన్నారు. నేడు ఆర్టీసి నిలబడిందని, ఉద్యోగుల్లో విశ్వాసం పెరిగిందంటే అందుకు ప్రధాన కారణం సిఎం రేవంత్ రెడ్డి అని అద్దంకి దయాకర్ బిఆర్ఎస్ నాయకులపై ధ్వజమెత్తారు.