యావత్ దేశానికే తలమానికంగా నిలిచిన తెలంగాణ సంక్షేమ గురుకులాలకు అద్దె బకాయిలు పేరుకుపోయి, చివరికి భవనాలకు తాళాలు వేసే దుస్థితి రావడం అత్యంత దుర్మార్గమని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తీవ్రంగా విమర్శించారు. గురుకులాల నిర్వహణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, దీనికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసమర్థత, చేతకానితనానికి నిదర్శనమని మండిపడ్డారు. ఈ మేరకు కెటిఆర్ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. విద్యాశాఖను తన వద్దే పెట్టుకున్న ముఖ్యమంత్రి, గురుకుల భవనాలకు ఏకంగా ఏడాది కాలం నుంచి అద్దె బకాయిలు చెల్లించకపోవడాన్ని కెటిఆర్ తప్పుబట్టారు. పేద విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపిన ఈ అత్యుత్తమ వ్యవస్థను కుప్పకూల్చి, కెసిఆర్ ఆనవాళ్లు చెరిపేయాలన్న కుట్రలో భాగంగానే సిఎం రేవంత్ రెడ్డి ఇదంతా చేస్తున్నట్టు అనుమానం కలుగుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఓవైపు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకుండా
విద్యార్థుల భవితవ్యాన్ని అంధకారంలోకి నెడుతున్న ముఖ్యమంత్రి, సంక్షేమ గురుకులాలను కూడా సమాధి చేసే పన్నాగం చేస్తే సహించే ప్రసక్తే లేదని హెచ్చరించారు.బిసి, ఎస్సి, ఎస్టి, మైనారిటీలతోపాటు అగ్రవర్ణ పేదలకు కార్పోరేట్ స్థాయి విద్యనందించిన రెసిడెన్షియల్ వ్యవస్థను బలిపెడితే బిఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి ఈ విషయం గుర్తుపెట్టుకుంటే మంచిదని ఘాటుగా వ్యాఖ్యానించారు. రెండేళ్లు నిండకుండానే రెండున్నర లక్షల కోట్ల అప్పులు తెచ్చిన రేవంత్ రెడ్డి, కనీసం గురుకులాల అద్దె కిరాయి కూడా కట్టకుండా, ఆ సొమ్ముతో ఎవరి జేబులు నింపుతున్నాడో తక్షణమే లెక్కలు చెప్పాలని కెటిఆర్ డిమాండ్ చేశారు. వెంటనే కాంగ్రెస్ సర్కారు రాష్ట్రంలోని అన్ని గురుకుల భవనాల అద్దె బకాయిలను విడుదల చేసి, విద్యార్థులు నష్టపోకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ఒకవేళ గురుకులాలకు తాళాలు వేసే దుస్థితే వస్తే, రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో కలిసి తెలంగాణ వ్యాప్తంగా ఈ నిరంకుశ కాంగ్రెస్ సర్కారుపై సమరశంఖం పూరిస్తామని హెచ్చరించారు. చిన్నారుల భవితవ్యంతో చెలగాటమాడుతున్న రేవంత్ రెడ్డికి ప్రజాక్షేత్రంలోనే గుణపాఠం చెబుతామని కెటిఆర్ స్పష్టం చేశారు.