స్టాక్హోమ్ : 2025 సంవత్సరానికి గాను వైద్య రంగంలో ముగ్గురికి నోబెల్ బహుమతి ప్రకటించారు. మేరీ ఈ. బ్రంకోవ్, ఫ్రెడ్ రామ్స్డెల్, సిమోన్ సకాగుచి ఈ పురస్కారానికి ఎంపికయ్యారు. శరీరం లోని రోగ నిరోధక వ్యవస్థ తన సొంత అవయవాలపై దాడి చేయకుండా ఎలా నిరోధించబడుతుందనే రహస్యాన్ని ఛేదించినందుకు గాను వీరికి ఈ పురస్కారం లభించింది. వీరి పరిశోధనలు పెరిఫెరల్ ఇమ్యూన్ టాలరెస్స్ అనే విధానంపై దృష్టి సారించాయి. దీని ద్వారా నియంత్రిత టి కణాలు ( రెగ్యులేటరీ టి సెల్స్) అని పిలిచే ప్రత్యేక రోగ నిరోధక కణాలు ఆటో ఇమ్యూన్ వ్యాధుల నుండి శరీరాన్ని రక్షించే సంరక్షకులుగా ఎలా పనిచేస్తాయో వారు ప్రపంచానికి తెలియజేశారు. మన రోగ నిరోధక వ్యవస్థ శరీర కణాలపై దాడి చేయకుండా అడ్డుకునేందుకు ఉన్న పెరిఫెరల్ ఇమ్యూన్ టాలరెన్స్ వ్యవస్థను గుర్తించినందుకు ఈ అవార్డు ఇస్తున్నట్టు నోబెల్ అవార్డు కమిటీ ప్రకటించింది. రోగ నిరోధక వ్యవస్థ కాపలాదారుగా వ్యవహరించే టీసెల్స్ లో కొన్ని అతిగా ప్రవర్తించకుండా నియంత్రిస్తున్నట్టు వీరు గుర్తించారు.
శరీరం పైకి దాడి చేసే సూక్ష్మజీవులను అడ్డుకునేందుకు రోగ నిరోధక వ్యవస్థ కొన్ని కణాలను విడుదల చేస్తూంటుంది. టీసెల్స్ కూడా వీటిల్లో ఒకటి. అయితే కొన్ని ప్రత్యేకమైన టీసెల్స్ ఇతర రోగ నిరోధక వ్యవస్థ కణాలను నియంత్రిస్తూ .. అవసరానికి మించి స్పందించకుండా చేస్తాయన్న మాట. ఈ ఆవిష్కరణ ఫలితంగా ఇమ్యునాలజీలో సరికొత్త శాఖ ఒకటి మొదలైంది. కేన్సర్తోపాటు మధుమేహం, కీళ్లవాపు, వంటి ఆటో ఇమ్యూన్ వ్యాధుల (రోగ నిరోధక వ్యవస్తే సొంత అవయవాలపై దాడి చేయడం )కు కొత్తకొత్త చికిత్సలు అభివృద్ధి చేసే వీలేర్పడింది. అంతేకాకుండా అవయవ మార్పిడి జరిగినప్పుడు శరీరం కొత్త అవయవాలను తిరస్కరించకుండా ఉండేలా చేసేందుకు వీరి ఆవిష్కరణ సాయపడుతుంది.
ఎందుకు ముఖ్యం?
రోగ నిరోధక వ్యవస్థ ఆరోగ్యంగా ఉండే శరీర కణజాలంపనై పదేపదే దాడులు చేయకపోవడం చాలా కాలంగా శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరుస్తూ వచ్చింది. దీనికి కారణాలేమిటో తెలుసుకునేందుకు చాలా ప్రయత్నాలే జరిగాయి. ఇతర రోగ నిరోధక కణాలను నియంత్రించేందుకు ప్రత్యేకమైన టీసెల్స్ ఉన్నట్టు ఈ ఏడాది నోబెల్ అవార్డు గ్రహీతలు గుర్తించడంతో ఈ మిస్టరీ విడిపోయింది. టైప్ 1 మధుమేహం, మల్టిపుల్స్కెరోసిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్ వంటివన్నీ కొన్ని సందర్భాల్లో రోగ నిరోధక వ్యవస్థ దాడుల వల్ల వచ్చే వ్యాధులు కావడం గమనార్హం.
ఆ ముగ్గురు శాస్త్రవేత్తల పూర్వాపరాలు
అమెరికా లోని సియాటెల్లోగల ఇనిస్టిట్యూట్ ఫర్ సిస్టమ్స్ బయోలజీలో ప్రస్తుతం సీనియర్ ప్రోగ్రామ్ మేనేజర్గా మేరీ బ్రుంకోవ్ పనిచేస్తున్నారు. 1961 లో జన్మించిన మేరీ బ్రుంకోవ్ అమెరికా లోని ప్రిన్స్టన్ యూనివర్శిటీ నుంచి పిహెచ్డి పొందారు. 1960 లో జన్మించిన ఫ్రెడ్రామ్స్డెల్ యూనివర్శిటీ కాలిఫోర్నియా నుంచి 1987 లో పిహెచ్డి పొందారు. శాన్ఫ్రాన్సిస్కోలో ఉన్న సోనోమా బయోథెరపాటిక్స్లో సైంటిఫిక్ అడ్వయిజర్గా పనిచేస్తున్నారు.1951 లో జన్మించిన షిమోన్ సకగుచి 1976 ఎండి, జపాన్ లోని క్యోటో యూనివర్శిటీ నుంచి 1983లో పిహ్చ్డి పొందారు. ఒసాకాలో ఉన్న ఒసాకా యూనివర్శిటీలో ఇమ్యునోలజీ ఫ్రాంటియర్ రీసెర్చి సెంటరలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు.
విజేతలకు ఇచ్చే బహుమతి ఇదే
నోబెల్ విజేతలకు ఇచ్చే మొత్తం నగదు బహుమతి 11మిలియన్ స్వీడిష్ క్రోనోర్ (ఎస్ఇకె). భారతీయ కరెన్సీలో ఇది సుమారు రూ. 10 కోట్లు. ఈ ఏడాది వైద్య రంగంలో ముగ్గురు శాస్త్రవేత్తలు ..మేరీ ఈ బ్రంకోవ్, ఫ్రెడ్ రామ్స్డెల్, షిమోన్ సకాగుచి.. ఈ బహుమతిని గెలుచుకున్నందున వీరి ఈ 11 మిలియన్ క్రోనోర్ను సమానంగా పంచుకుంటారు. నగదుతోపాటు ప్రతి నోబెల్ గ్రహీతకు బంగారు పతకం, నోబెల్ ఫౌండేషన్ తయారు చేసిన ఆల్ఫ్రెడ్ నోబెల్ చిత్రంతో కూడిన 18 క్యారెట్ల బంగారు పతకం లభిస్తుంది. ప్రతి విజేతకు ప్రత్యేకంగా రూపొందించిన డిప్లొమా లభిస్తుంది.