మన తెలంగాణ/హైదరాబాద్ : హైదరాబాద్ సికింద్రాబాద్ పరిధిలోని సిటీ బస్సు ఛార్జీలు పెరిగాయి. ఈ నెల 6 నుంచి అదనపు చార్జీలు అమలులోకి రానున్నాయి. ఎలక్ట్రిక్ బస్సుల మౌలిక సదుపాయాల వ్యయాన్ని సమకూర్చుకునేందుకు సిటీ బస్సుల్లో అదనపు ఛార్జీని విధిస్తున్నట్లు ఆర్టిసి సంస్థ వెల్లడించింది. ఇందుకు ప్రభుతం ఇదివరకే అనుమతించింది. హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధిలో నడిచే అన్ని బస్సుల్లో అదనపు ఛార్జీని వసూలు చేయనున్నట్లు సంస్థ వెల్లడించింది. సిటీ ఆర్డినరీ, మెట్రో ఎస్ప్రెస్, ఈ–ఆర్డినరీ, ఈఎస్ప్రెస్ బ స్సుల్లో మొదటి మూడు స్టేజిలకు రూ. 5, 4వ స్టేజి నుంచి రూ.10 అదనపు ఛార్జీని సంస్థ విధించింది. మెట్రో డీలక్స్, ఈ–మెట్రో ఎసి సర్వీసుల్లో మొదటి స్టేజీకి రూ. 5, రెండో స్టేజీ నుంచి రూ.10 అదనపు ఛార్జీని వసూలు చేయనున్నారు. హైదరాబాద్ భవిష్యత్ బాగు కో సం వాడకలోకి తీసుకువస్తోన్న ఎలక్ట్రిక్ బస్సులను ప్రజలు ఆదరించాలని, నగర ప్రజా ర వాణా ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చబోతున్న ఈ గ్రీన్ జర్నీలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలని ఆర్టిసి ప్రజలకు సూచించింది. పర్యావరణహిత
కార్యక్రమానికి సహకరించి గతంలో మాదిరిగానే ఆర్టిసి సేవలను ప్రోత్సహించాలని ప్రజలకు విజ్ఞప్తి చేసింది. హైదరాబాద్ లో కాలుష్యరహిత ప్రజా రవాణా వ్యవస్థను అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం నిర్ణయించింది. నగరవాసులను అనారోగ్యానికి గురి చేసే వాయు కాలుష్యాన్ని తగ్గించడం, ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టేందుకు పర్యావరణ హితమైన ఎలక్ట్రిక్ బస్సులను వినియోగించాలని ప్రభుత్వం ఆర్టిసిని ఆదేశించింది. హైదరాబాద్ ఓఆర్ఆర్ లోపల 2027 నాటికి 2800 ఎలక్ట్రిక్ బస్సులను డీజిల్ బస్సుల స్థానే ప్రవేశ పెట్టాలని నిర్దేశించింది. నగరంలోని ప్రజా రవాణా వ్యవస్థను క్లీన్ అండ్ గ్రీన్ దిశగా నడిపించేందుకు ఈ నిర్ణయం ఒక శుభ సంకేతం. పర్యావరణ పరిరక్షణలో ఇది విప్లవాత్మక అడుగుగా సంస్థ భావిస్తోంది. పూర్తి స్థాయిలో 2800 కొత్త ఎలక్ట్రిక్ బస్సులు వినియోగంలోకి వస్తే వ్యక్తిగత వాహనాల కొనుగోళ్లు తగ్గడంతో పాటు ప్రజా రవాణా వినియోగం పెరుగుతోందని, ఫలితంగా వాహనాల నుంచి వెలువడే ఉద్గారాలు తగ్గుతాయని, నగరవాసులకు శ్వాసకోశ సమస్యలు, గుండె జబ్బులు తగ్గి, ప్రజల ఆయుర్థాయం మెరుగుపడుతుంది భావిస్తోంది.
ప్రభుత్వ ఆదేశాలతో 2800 కొత్త ఎలక్ట్రిక్ బస్సులను సమకూర్చుకునేందుకు ఆర్టిసి యాజమాన్యం ఇప్పటికే చర్యలు చేపట్టింది. రాబోయే రెండేళ్లలో దశల వారీగా ఎలక్ట్రిక్ బస్సులను వాడకంలోకి తెచ్చేలా ప్రణాళిక రూపొందించింది. ఎలక్ట్రిక్ బస్సులకు అనుగుణంగా మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసుకుంటోంది. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ లో 25 డిపోలున్నాయి. అందులో 6 డిపోల పరిధిలో 265 ఎలక్ట్రిక్ బస్సులు నడుస్తుండగా, ఈ ఏడాదిలో మరో 275 ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి వస్తున్నాయి. ఒక్కో డిపోలో రూ.8 కోట్ల వ్యయంతో పూర్తిస్థాయిలో చార్జింగ్ కోసం హెచ్టీ కనెక్షన్లను టిజిఎస్పిడిసిఎల్, ట్రాన్ కో ద్వారా నిర్మించింది. రాబోయే 2800 కొత్త ఎలక్ట్రిక్ బస్సుల కోసం 19 డిపోల్లో చార్జింగ్ కోసం హెచ్టీ కనెక్షన్లను సంస్థ ఏర్పాటు చేయనుంది. ఎలక్ట్రిక్ బస్సుల ద్వారా హైదరాబాద్ లో ప్రజా రవాణాను మరింతగా విస్తరించేందుకు కొత్తగా 10 డిపోలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. కొత్తగా 10 చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనుంది. ఈ మౌలిక సదుపాయాలకు రానున్న సంవత్సరంలో రూ.392 కోట్ల మేర వ్యయమవుతుందని ఆర్టిసి అధికారులు అంచనా వేశారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆర్టిసి ఈ ఆర్థిక భారాన్ని మొయలేదు. ప్రభుత్వం, ప్రజల సహకారంతో ఈ వ్యవస్థను ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటోంది.