రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడ్డంతో గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఎన్నికలు జరుగుతాయో లేదో అనే అనేక అనుమానాల మధ్య ఎట్టకేలకు నోటిఫికేషన్ వెలువడ్డంతో పోటీ చేసే ఆశావహులు పెద్ద ఎత్తున సన్నద్దమవుతున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వార్డు సభ్యుల ఎన్నికలో యువత పాల్గొనేందుకు, అదీ మహిళలు పెద్ద ఎత్తున ముందుకు వస్తున్నారు. దీంతో సర్పంచ్ స్థానానికి పోటీ చేయాలంటే ఎలాంటి అర్హతలు ఉంటే అర్హులు, ఏ నిబంధనల కింద అనర్హులవుతారనే అంశంపై విస్త్రత చర్చలు జరుగుతున్నాయి.
సర్పంచ్ స్థానానికి పోటీ చేసే వారికి ఉండాల్సిన అర్హతలు
సర్పంచ్ పదవికి పోటీ చేయాలనుకునే వ్యక్తి కచ్చితంగా ఆ గ్రామ పంచాయతీలో స్థానికుడై ఉండాలి. పోటీ చేయాలనునే వారి పేరు పంచాయతీ పరిధిలోని ఓటర్ల జాబితాలో తప్పకుండా నమోదై ఉండాలి. సర్పంచ్ స్థానానికి నామినేషన్ దాఖలు చేసే సమయానికి పోటీ చేయాలనుకునే వ్యక్తి వయసు 21 సంవత్సరాలు నిండి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ కేటగిరీ అభ్యర్థులు జనరల్ కేటగిరి నుంచి కూడా పోటీ చేయడానికి ఆస్కారం ఉంది. మహిళలు తమకు రిజర్వు చేసిన స్థానాలతో పాటు అదే కేటగిరిలోని జనరల్ స్థానాల్లోనూ పోటీ చేసేందుకు అర్హులవుతారు.
ఇటువంటి వారు అనర్హులు
సర్పంచ్ పదవికి పోటీ చేసే వారు కొన్ని నిబంధనల గురించి తెలుసుకోవాలని చెబుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, స్థానిక సంస్థలు, ఎయిడెడ్ సంస్థల్లో పని చేస్తున్న ఉద్యోగులు సర్పంచ్ పదవికి పోటీ చేసేందుకు అనర్హులు. ఏదైనా నేరానికి పాల్పడి శిక్ష పడిన వారూ పోటీ చేయకూడదు. చట్టం ద్వారా ఏర్పడిన ఏ సంస్థలో ఉద్యోగం చేస్తున్న వారైనా కూడా అనర్హులే. నేర శిక్ష అనుభవించి ఐదు సంవత్సరాలు పూర్తిచేసుకోని వారు కూడా సర్పంచ్ పోటీకి అనర్హులు. బదిరులు, మూగవారు, మతిస్థిమితం లేని వారు కూడా అనర్హులే. దివాళాదారుగా గుర్తించబడి న్యాయ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్న వారూ అనర్హులే. రుణ విమోచన పొందని దివాళాదారు కూడా పోటీకి పనికారారు. పౌరహక్కుల పరిరక్షణచట్టం- 1955 పరిధిలోకి వచ్చే కేసుల్లో శిక్ష పడినవారు సైతం పోటీ చేయకూడదు. గ్రామ పంచాయతీ, మండల, జిల్లా పరిషత్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో ఏదైనా పనికి కాంట్రాక్టు చేసుకున్న వారు కూడా అనర్హులవుతారు. ఇద్దరు కంటే ఎక్కువ పిల్లలు ఉన్న వారు కూడా సర్పంచ్ పదవికి పోటీ చేసేందుకు అనర్హులే. అవినీతికి కానీ విశ్వాస ఘాతుకానికి గానీ పాల్పడి ఉద్యోగం నుంచి తొలగించబడితే ఆ రోజు నుంచి ఐదేళ్లు పూర్తిగా పోటీకి అనర్హులవుతారు. తమ పంచాయతీకి వ్యక్తిగతంగా బకాయిపడిన వారు, బకాయిల చెల్లింపులకు నోటీసులు ఇచ్చినా చెల్లించిన వారు పోటీ చేయడానికి అనర్హులేనని నిబంధనలు చెబుతున్నాయి.