భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇటీవల కాలంలో వివిధ దేశాల పర్యటనలో భాగంగా, భారతదేశం ప్రపంచంలో నాల్గవ ఆర్థిక అభివృద్ధి చెందిన దేశంగా మారుతున్నదని చెప్తున్నారు. భారతదేశంలో ప్రస్తుతం ఉన్న సామాజిక, రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక పరిస్థితులను క్షుణ్ణంగా గమనిస్తే, భారతదేశం ప్రపంచంలో నేడు ఆర్థికంగా శక్తివంతంగా ఉన్న అమెరికా, చైనా, రష్యా, జపాన్ తదితర దేశాలను వెనక్కి నెట్టి భారతదేశం నిజంగానే ఆర్థికంగా అభివృద్ధిని సాధిస్తుందా అని లోతుగా ఆలోచిస్తే అనేక రకమైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకనగా ఒకపక్క ప్రపంచ మానవ అభివృద్ధి సూచిలో భారతదేశం నేటికీ 193 దేశాల్లో 130వ స్థానంలో ఉండగా, భారతదేశం ఆర్థిక ప్రగతిలో నాల్గవ స్థానంలో ఉన్నదని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పదే పదే చెప్తే అబద్ధాలు నిజం అవ్వవు కదా..! అసలు మానవ అభివృద్ధి లేకుండా..? ఆర్థిక ప్రగతిని సాధించడం ఏంటి..? నేడు 140 కోట్ల మంది ఉన్న భారతీయుల్లో అత్యంత అభివృద్ధికి దూరంగా ఉంటూ, మధ్యతరగతి జీవితాన్ని గడుపుతున్నది ఎవరంటే సామాన్యులు నిరుపేదలైన బిసి, ఎస్సి, ఎస్టిలే కనీస మౌలిక సదుపాయాలు అందక దుర్భర జీవితాన్ని గడుపుతూ, ప్రభుత్వాలు ఇచ్చే ఉచిత పథకాల కోసం తాపత్రయపడుతున్నారు. కానీ ఒకపక్క కేంద్ర ప్రభుత్వం ప్రపంచ దేశాలనే తలదన్ని భారతదేశం మూడవ లేదా నాల్గవ ఆర్థిక శక్తి కలిగిన దేశంగా ఎదుగుతున్నమని చెప్తున్నారు.
కానీ క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే దేశంలో ఉన్న 10% అగ్రవర్ణాల అభివృద్ధిని 100 కోట్ల పైగా ఉన్న బిసి, ఎస్సి, ఎస్టిల అభివృద్ధిగా కేంద్ర ప్రభుత్వం మరి ముఖ్యంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ చెప్పడం అంటే దేశంలో మెజారిటీగా ఉన్న అణగారిన వర్గాలని మోసం చేయడమే కదా..! అగ్రవర్ణాలకు మాత్రమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా లబ్ధి జరుగుతూ అణగారిన వర్గాలకి తరతరాలుగా అన్యాయం జరుగుతుందని అనేక గణంకాల ప్రకారం నిరూపితం అవుతున్నది. అది ఎలా అంటే నేడు దేశంలో 10% ఉన్న అగ్రవర్ణాలు ప్రభుత్వ విద్యా సంస్థలను కాదని అత్యంత ఆధునిక సౌకర్యాలు కలిగిన కార్పొరేట్ విద్యని పొందుతున్నారు. అత్యంత ఆధునిక సౌకర్యాలతో కార్పొరేట్ వైద్యాన్ని పొందుతున్నారు. కానీ 100 కోట్ల పైబడి ఉన్న బిసి, ఎస్సి, ఎస్టిలు మాత్రం ప్రభుత్వాలనుండి మెరుగైన ఉచిత విద్య, వైద్యం, ఉపాధి, ఇల్లు, భూమి లభించక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యని నిర్లక్ష్యం చేసి నిరుపేదలైన సామాన్యులైన బిసి, ఎస్సి, ఎస్టి లకు ఉచిత ప్రభుత్వ విద్యని కల్పించకపోవడం వల్ల అటు కార్పొరేటు విద్యని కొనలేక అణగారిన వర్గాల విద్యార్థుల తల్లిదండ్రులు పస్తులు ఉంటూ, అప్పుల పాలు అవుతూ, ఉన్న కొద్ది ఆస్తిని అమ్ముకొని తమ బిడ్డల భవిష్యత్ కోసమని ప్రైవేటు విద్యా సంస్థల్లో చదివిస్తున్నారు. ఇక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అత్యాధునిక సౌకర్యాలతో కూడిన ఉచిత వైద్యాన్ని అందించకపోవడం మూలంగా కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని కొనలేక, ప్రభుత్వ వైద్యశాలలో సరైన సదుపాయాలు లేక అణగారిన వర్గాలకి చెందిన వేల, లక్షల కుటుంబలు అనారోగ్యాల బారినపడుతున్నారు.
సరైన విజ్ఞానంతో కూడిన స్కిల్స్ లేక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సరైన ఉపాధి నిరుద్యోగులకు కల్పించకపోవడం మూలంగా లక్షల మంది అణగారిన వర్గాల నిరుద్యోగులు దినసారి కార్మికులుగా పనిచేస్తున్నారు. ఇక అగ్రవర్ణాల కబంధహస్తాల్లో వేల, లక్షల ఎకరాల భూమి ఉండడం చేత అణగారిన వర్గాల చేతుల్లో భూమి లేకపోవడం వలన పీడిత వర్గాలకు చెందిన లక్షల కుటుంబాలు ప్రభుత్వాలు ఉచిత భూమిని కల్పిస్తే స్వశక్తితో వ్యవసాయం చేసుకొని ఆత్మగౌరవంతో బతకాలని వేచిచూస్తున్నారు. మరి అలాంటి కుటుంబాలకి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత భూపంపిణీ చేస్తే, దేశంలో అభాగ్యులుగా ఉండి పేదరికంలో ఉన్న లక్షల మంది అణగారిన వర్గాల కుటుంబాలు సామాజికంగా, ఆర్ధికంగా అభివృద్ధిని సాధిస్తాయి కదా..! మరి మౌలిక సదుపాయాలైన విద్య, వైద్యం, ఉపాధి, ఇల్లు, భూమి విషయంలో ఇంతటి తారతమ్యాలు ఉంచుకొని అగ్రవర్ణాల ప్రగతిని మొత్తం దేశం ప్రగతిగా చూపిస్తే, కోట్లమంది అణగారినవర్గాలు అభివృద్ధికి దూరంగా జీవిస్తున్నారు కదా..! దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఏ విధంగా భారతదేశం ఆర్థికంగా చాలా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతూ నాల్గవ ఆర్థిక శక్తి కలిగిన దేశంగా తయారవుతున్నమని చెప్తారు. నేడు ప్రపంచంలో ఆర్థికంగా అభివృద్ధి చెందిన దేశాలైన అమెరికా, చైనా, రష్యా, జపాన్ మొదలగునవి అక్కడి ప్రజలకి మౌలిక సదుపాయాలన్నీ సమృద్ధిగా కల్పించి, ఆ తర్వాత ఆర్థిక ప్రగతిని సాధించాయి తప్ప, ఆయ దేశాల మానవ అభివృద్ధిని సాధించకుండా ఆర్థిక అభివృద్ధి పైనే దృష్టి పెట్టలేదు.
కానీ భారతదేశంలో మాత్రం మానవ అభివృద్ధి లేకుండా ఆర్థ్ధిక అభివృద్ధి సాధిస్తున్నామని దేశ ప్రధాని నరేంద్ర మోడీ చాలా గర్వంగా పదేపదే చెప్తున్నారు.అంటే ఒక రకంగా దేశ ప్రజలను మరి ముఖ్యంగా అత్యంత కడు పేదరికంలో ఉన్న అణగారిన వర్గాలని మభ్యపెడుతూ మోసం చేస్తున్నరాని చెప్పడానికి నిదర్శనం కదా..! కాబట్టి ఇకనైనా కేంద్ర ప్రభుత్వం తమ విధానాన్ని మార్చుకొని మానవ అభివృద్ధిని సాధిస్తూ, అందులో భాగంగా దేశంలో ఉన్న కుల, మత తారతమ్యాలని అధిగమిస్తూ భారత పౌరులకి సౌకర్యవంతమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తూ, మానవ అభివృద్ధిలో భాగంగా దేశ ఆర్థిక అభివృద్ధిని భాగం చేయాలి తప్ప, మానవ అభివృద్ధిలేని ఆర్థిక ప్రగతి సాధించడం అంటే అది ఆధునిక అనాగరిక చర్యకు నిదర్శనంగా గ్రహించాలి. కాబట్టి దేశంలో ఉన్న కుల, మతాలకతీతంగా భారతీయ పౌరులందరికీ సౌకర్యవంతమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తూ, మరోపక్క ఆర్థిక ప్రగతిని సాధిస్తే, అప్పుడు మాత్రమే భారతదేశం మానవ అభివృద్ధి సూచీలో అత్యంత ఉన్నత స్థానంలో ఉంటది, ఆర్థికంగా కూడా బలమైన దేశంగా ఎదుగుతాదని మేధావులు, విద్యావంతులు, సామాన్యులు సైతం గ్రహించాల్సిన చారిత్రక సత్యం.
పుల్లెంల గణేష్
95530 41549