అరుణాచలంగా ప్రసిద్ధి చెందిన తమిళనాడులోని తిరువణ్ణామలై సమీపంలో ఎపికి చెందిన 18 ఏళ్ల యువతిపై ఇద్దరు పోలీసులు అత్యాచారం చేసిన ఘటన సంచలనంగా మారింది. సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళితే సోమవారం ఓ ఇద్దరు యువతులు ఆంధ్రా నుంచి తిరువణ్ణామలై వెళుతున్న గూడ్స్ వాహనంలో ఎక్కారు. ఆ ఇద్దరు యువతులు అక్కాచెల్లెళ్లు. ఆ గూడ్స్ వాహనంలో ఇద్దరు అక్కాచెల్లెళ్లు, డ్రైవర్ మాత్రమే ఉన్నారు. వాహనం రాత్రికి ఎంథాల్ బైపాస్ రోడ్ వద్దకు చేరుకుంది. బైపాస్పై పెట్రోలింగ్లో ఉన్న తిరువణ్ణామలై ఈస్ట్ పోలీస్ స్టేషన్కు చెందిన పోలీసులు సురేశ్ రాజ్, సుందర్ వాహనాన్ని ఆపారు. అనుమానం ఉందని చెప్పి ఆ యువతుల్ని వాహనం నుంచి కిందకు దింపారు.
కొద్దిసేపు ప్రశ్నించిన తర్వాత ఆ ఇద్దరు పోలీసులు యువతుల్లో ఒకరిని బలవంతంగా సమీపంలోని పొదల్లోకి తీసుకెళ్లారు. అక్కడే దారుణంగా కొట్టి, లైంగిక దాడికి పాల్పడ్డారు. ఇదంతా బాధితురాలి సోదరి చూస్తుండగానే జరిగింది. లైంగిక దాడి తర్వాత పోలీసులు బాధితురాలిని రోడ్డుపక్కన వదిలి పారిపోయారు. మంగళవారం ఉదయం సుమారు 4 గంటల సమయంలో స్థానికులు రోడ్డుపక్కన ఉన్న బాధితురాలిని గుర్తించారు. ఆమెను వెంటనే 108 అంబులెన్స్లో తిరువణ్ణామలై గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్కు తరలించారు. సమాచారం అందుకున్న ఎస్పీ సుధాకర్, డీఎస్పీ సతీష్ ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ బాధితురాలి వాంగ్మూలం రికార్డు చేశారు. ఆ తర్వాత ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పోలీసులు ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి, విచారిస్తున్నారు.